రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?
న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా రగులుతున్న, నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను మనదేశ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వ్యక్తులకు అప్పగించింది. ఆ ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. హిందూ సంఘాలు, ముస్లిం ప్రతినిధుల నుంచి అందే వినతిపత్రాలు స్వీకరిస్తుంది. వారి వాదనలను వింటుంది ఈ కమిటీ. వాటన్నింటినీ క్రోడీకరించి సుప్రీంకోర్టుకు ఓ నివేదిక అందిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఈ ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ చేయాల్సిన పని అదే.
రామజన్మభూమి వివాద పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ: 8 వారాల గడువు..
ఎవరా ముగ్గురు?
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుక్షణమే ఆ ముగ్గురు మధ్యవర్తుల పేర్లు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారుమోగిపోయాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు. ఈ ముగ్గురినీ సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ సభ్యులుగా నియమించింది. ఖలీఫుల్లా ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
న్యాయవాద రంగంలో అపార అనుభవం
ఖలీపుల్లా పూర్తి పేరు ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా. న్యాయవాద రంగంలో ఆయనకు అపార అనుభవం ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మూడున్నరేళ్ల కిందట పదవీ విరమణ చేశారు. 1951 జులై 23వ తేదీన ఆయన తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 67 సంవత్సరాలు. 1975 ఆగస్టు 20న న్యాయవాదిగా తన కేరీర్ ఆరంభించారు. దశలవారీగా ఎదిగారు. కీలక తీర్పులను వాదించారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. క్రమంగా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. 2011 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 2012 ఏప్రిల్ 2 వరకు జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. 2012 ఏప్రిల్ 2వ తేదీ నుంచి 2016 జులై 22 వ తేదీ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
శతృవులను సైతం ఒకే చోట కూర్చోబెట్టగల మధ్యవర్తిత్వం ఆయన సొంతం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ పేరు తెలియని వారు బహుశా ఈ దేశంలో ఉండకపోవచ్చు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా రవిశంకర్ అందరికీ సుపరిచితుడు. ఆయన కూడా తమిళుడే. తమిళనాడులోని పాపనాశంలో 1956 మే 13వ తేదీన ఆయన జన్మించారు. నాలుగేళ్ళ వయసులోనే భగవద్గీత గ్రంధాన్ని పూర్తిగా పఠించిన ఘనత ఆయన సొంతం. 17 సంవత్సరాల నాటికి వేదసాహిత్యం సమగ్ర అధ్యయనం, దానితోబాటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పట్టా అందుకున్నారు.
సంఘర్షణల నివారణలో సిద్ధ హస్తుడు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు తలెత్తిన అనేక ప్రాంతాలలో రవిశంకర్ శాంతిచర్చలలో పాల్గొన్నారు. కాశ్మీర్, బీహార్ సహా శ్రీలంక, ఇరాక్, ఐవరీకోస్ట్, కామెరూన్ లల్లో మధ్యవర్తిత్వాలను నిర్వహించారు. రెండు పక్షాలనూ శాంతిచర్చలకు ఒప్పించడంలో ఆయన దిట్ట. శతృవులను సైతం ఒక చోటకు చేర్చగలిగారు. 1981వ సంవత్సరంలో శ్రీశ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. 152 దేశాల్లో విస్తరించింది. ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపు పొందింది. ఏటా సుమారు 40 దేశాల్లో పర్యటిస్తారు.
మధ్యవర్తిత్వంలో నిపుణుడు
సుప్రీంకోర్టు నియమించిన మూడో వ్యక్తి శ్రీరామ్ పంచు. ప్రముఖ న్యాయవాది. ఆయన కూడా మధ్యవర్తిత్వాలను నెరపడంలో నిపుణుడు. దేశంలోనే టాప్ మీడియేటర్ గా ఆయనకు పేరు ఉంది. రెండు పక్షాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి శ్రీరామ్ పంచు సొంతంగా ఓ మీడియేషన్ ఛాంబర్ ను కూడా నెలకొల్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మీడియేటర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంటర్నేషన్ మీడియేషన్ ఇన్స్టిట్యూట్ బోర్డు సభ్యుడు కూడా. దేశవ్యాప్తంగా కార్పొరేట్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో నెలకొన్న భూ వివాదాలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. వాటిని పరిష్కార మార్గాలను చూపించగలిగారు. గతంలో అసోం, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య 500 చదుపు కిలోమీటర్ల భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీరామ్ పంచు సభ్యునిగా ఉన్నారు.