అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగి
న్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం లేదు. దీంతో మంగళవారం నాడు ఈ కేసుపై విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఎస్ఎ బాబ్డే అందుబాటులో లేని కారణంగా దీనిపై విచారణ జరపడం లేదని పేర్కొంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య కేసుపై వచ్చే మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. అంతకుముందు ఈ వారం ఆరంభంలో అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇద్దరు కొత్త జడ్జిలను చేర్చడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పునర్వ్యవస్థీకరించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణా క్రమాన్ని నిర్ణయిస్తుంది.
న్యాయ విచారణకు సుప్రీం కోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మార్పులు చేశారు. తొలుత పేర్కొన్న ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్ స్థానంలో కొత్తగా జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్లను తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే జస్టిస్ యుయు లలిత్ మాత్రం గతంలో అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులో లాయర్గా ఉన్నందున తాను కొనసాగలేనని చెప్పారు.
తాజా నిర్ణయంతో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్లు సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ ధర్మాసనం జనవరి 29 నుంచి అయోధ్య వివాదంపై విచారణ చేపట్టాల్సి ఉండగా, ఓ న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది.
సమస్యను మాకు అప్పగించండి: యోగి ఆదిత్యనాథ్
రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును త్వరగా తేల్చేందుకు సుప్రీం కోర్టు కృషి చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అనవసర జాప్యం జరిగితే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముందని చెప్పారు. ఆయన ఓ టెలివిజన్ ఛానల్లో మాట్లాడారు. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని, అది సాధ్యపడకపోతే ఈ అంశాన్ని తమకు అప్పగించాలన్నారు.
రామజన్మభూమి వివాదాన్ని తాము 24 గంటల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అంతకంటే అదనంగా ఒక్క గంట సమయాన్ని కూడా తీసుకోమన్నారు. లక్షల మంది ప్రజలను సంతృప్తి పరిచేందుకు సుప్రీం త్వరగా న్యాయం చేయాలని, అది ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచేలా ఉండాలన్నారు. అనవసర జాప్యం కారణంగా సంక్షోభానికి, ప్రజల్లో అసహనానికి దారి తీస్తోందని చెప్పారు.
ఈ వివాదం పరిష్కారమవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం, ట్రిపుల్ తలాక్పై నిషేధం అమలుతో దేశంలో సంతుష్ట రాజకీయాలకు శాశ్వతంగా తెరపడుతుందని చెప్పారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీల పొత్తుపై మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటికీ 70 శాతం మంది ఓటర్లు బీజేపీ వెంటే ఉన్నారని, కేవలం 30 శాతం మంది ఓటర్లు మాత్రమే మహాకూటమి వైపు ఉన్నారన్నారు.