అయోధ్య కేసు : మధ్యవర్తిత్వానికి మరింత గడువు.. ఆగస్టు 2 నుంచి కేసు విచారిస్తామన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ : అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి మరికొంత గడువు ఇచ్చింది. మీడియేషన్ ప్యానల్ విజ్ఞప్తి మేరకు జులై 31 వరకు మధ్యవర్తిత్వానికి సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితానికి సంబంధించిన నివేదికను ఆగస్టు 1న ఇవ్వాలని ఆదేశించింది. దాన్ని పరిశీలించిన అనంతరం ఆగస్టు 2న తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది.
ముగ్గురు వ్యక్తులతో కమిటీ
అయోధ్య వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరామ్ పంచులను కమిటీలో సభ్యులుగా నియమించింది. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎలాంటి పురోగతి చోటు చేసుకోవడంలేదని, అందుకే దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది.
నివేదిక సమర్పించిన ప్యానెల్
పిటీషన్పై జులై 11న విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, మధ్యవర్తిత్వ పురోగతికి సంబంధించి జులై 18న నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కమిటీ నివేదిక సమర్పించగా.. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ప్యానెల్కు మరికొంత సమయం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం
అయోధ్యలో 2.77ఎకరాల భూమికి సంబంధించి దశాబ్దాలుగా పంచాయితీ నడుస్తోంది. ఆ స్థలం తమదంటే తమదంటూ సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలు కోర్టుకెక్కాయి. 2010లో కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాతో పాటు రామ్లల్లాకు సమానంగా పంచాలని ఆదేశించింది. ఈ తీర్పును 14మంది సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరుపుతున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ మార్చి 8న నిర్ణయం తీసుకుంది.