అయోధ్య భూవివాదంలో ముందడుగు: వాదనలకు చివరి తేదీ ఇదే..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అయోధ్య అంశంపై జరుగుతున్న అన్ని వాదనలను అక్టోబర్ 18కల్లా ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. అయోధ్య భూవివాదంపై 32వ సారి వాదనలు వింటున్న సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు అయోధ్య భూవివాదం కేసులో అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించి ముగించేందుకు 10.5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని నొక్కి చెప్పారు జస్టిస్ రంజన్ గొగోయ్.
అక్టోబర్ 18న వాదనలు ముగించేందుకు డెడ్ లైన్
నవంబర్ నెలాఖరులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం ముగియనుంది. ఆలోగ అయోధ్య వివాదంపై ఒక తీర్పు ఇవ్వాలని కృత నిశ్చయంతో చీఫ్ జస్టిస్ ఉన్నారు. ఒకవేళ నాలుగువారాల్లోగా వాదనలు ముగిసి తీర్పు వస్తే కొన్నేళ్లుగా కొనసాగుతున్న అతి సున్నితమైన అయోధ్య భూవివాదం కేసులో అద్భుతం జరిగినట్లే అవుతుంది. అక్టోబర్ 18న డెడ్లైన్ విధించిన సుప్రీంకోర్టు దీపావళి పండుగ సందర్భంగా వారం రోజులను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.
నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ
ఇక అయోధ్య భూవివాదం కేసు విచారణ సందర్భంగా శనివారాల్లో కూడా కోర్టు మరింత సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. త్వరతగతిన వాదనలు ముగిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు గత వారం ప్రకటించింది. నవంబర్ 17న ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయనున్నారు అయోధ్య కేసును విచారణ చేస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహిస్తున్నారు. దీంతో అక్టోబర్ 18న చివరి తేదీగా ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
మధ్యవర్తిత్వం ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు
అక్టోబర్ 18వ తేదీని చివరితేదీగా ప్రకటిస్తూనే, మధ్యవర్తిత్తం ద్వారా కూడా కేసును సెటిల్ చేసుకునే అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లు ఉన్నారు. వీరంతో గత 32 రోజులుగా అయోధ్య భూవివాదం కేసులో వాదనలు వింటున్నారు. మధ్యవర్తిత్వం వహించడం ద్వారా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరక్క పోవడంతో ఆగష్టు 6నుంచి ప్రతిరోజూ అయోధ్య భూవివాదం కేసుపై వాదనలు జరుగుతున్నాయి.