అయోధ్యపై తీర్పు: ముస్లిం మత పెద్దలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల కీలక భేటీ..వివాదాస్పద అంశాల జోలికి..!
న్యూఢిల్లీ: అత్యంత సున్నితమైన అయోధ్య భూ వివాదానికి సంబంధించిన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువడించబోతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా స్వాగతించాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచన ప్రాయంగా ఆదేశాలను జారీ చేసింది. తీర్పు వెలువడిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాలపై ఇప్పటికే డేగకన్ను వేసింది. శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఉత్తర్ ప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయుధ బలగాలను పంపించింది.
AP CS LV Subrahmanyam: మళ్ల వార్తలోకెక్కిన జెరూసలేం మత్తయ్య: ఎల్వీ సుబ్రహ్మణ్యం.. బీజేపీ ఏజెంట్..!
దీనితోపాటు- మరో అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతాపార్టీ (బీజేపీ), ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశ రాజధానిలో.. కేంద్రమంత్రి అబ్బాస్ ముఖ్తార్ నక్వి అధికారిక నివాసంలో ఈ భేటీని నిర్వహించింది. అబ్బాస్ ముఖ్తార్ నక్వీ దీనికి నేతృత్వం వహించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించిన తరువాత దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనే విషయంపై వారితో చర్చించారు.
ఆర్ఎస్ఎస్ తరఫున కృష్ణ గోపాల్, రామ్ లాల్, బీజేపీ తరఫున కేంద్ర మాజీమంత్రి షానవాజ్ హుస్సేన్ లతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముస్లిం మత పెద్దల తరఫున జమాతే హింద్ ప్రధాన కార్యదర్శి మహమూద్ మదాని, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ముజప్ఫర్ అలీ, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కమాల్ ఫారుఖీ, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలాంటిదైనా దాన్ని స్వాగతించాల్సి ఉంటుందని ముఖ్తార్ నక్వీ వారికి తెలియజేశారు. ఇందులో మరో మాటకు అవకాశం లేదని అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం ఉందనే భారతీయ తత్వాన్ని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మత సామరస్యాన్ని చాటుకోవడానికి ఇదే సరైన సమయం అని నక్వీ చెప్పారు. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అన్నారు. తీర్పు వెలువడిన తరువాత అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి కేంద్రం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలను నక్వీ వారికి వివరించారు. శాంతిభద్రతలను పరిరక్షించే విషయంలో ఎలాంటి కఠిన చర్యలకైనా దిగాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అన్నారు.