అయోధ్య రామజన్మభూమి కేసు : సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు..!
ఢిల్లీ : అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం మధ్యవర్తిత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆ మేరకు ముగ్గురితో కూడిన ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు లను నియమించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాసాలతో కూడుకున్నదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్ను కలిసిన చిరుమర్తి..!
అయోధ్యలోని 2.7 ఎకరాలకు సంబంధించిన భూవివాదం వివాదస్పదమైంది. ఆ మేరకు ఏళ్లకొద్దీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నిర్మోహి అఖారా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్కు సుప్రీంకోర్టుకు అప్పజెప్పింది. ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్ తేల్చనుంది. ఇక అయోధ్యలో 67.7 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా 1993లో స్టే విధించారు. 2010 లో 2.77 ఎకరాల భూమిని అలహాబాద్ కోర్టు ముగ్గురికి పంచింది. ఆ తీర్పుపైనే ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. అలహాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ 14 విజ్ఞప్తులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరాయి.
సుప్రీంకోర్టు చెప్పిన 5 ప్రధానాంశాలు :
1. అయోధ్య భూవివాదం పరిష్కారంలో మధ్యవర్తిత్వం నెరపడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ నియమించింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ పండిట్ రవిశంకర్, న్యాయవాదిగా కొనసాగుతున్న మధ్యవర్తిత్వ నిపుణుడు శ్రీరామ్ పంచు సభ్యులుగా వ్యవహరిస్తారు.
2. మధ్యవర్తిత్వ ప్రక్రియను 8 వారాల్లోగా ( రెండు నెలల వ్యవధి) ఈ ప్యానెల్ పూర్తిచేయాలి. లోక్ సభ ఎన్నికలు రాకముందే అంటే మార్చి 15వ తేదీ నుంచి మే 15వ తేదీలోగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.
3. ఈ కేసులో మధ్యవర్తిత్వానికి సంబంధించిన ఫస్ట్ స్టేటస్ రిపోర్టును నాలుగు వారాల్లోగా ( నెల వ్యవధి ) సుప్రీంకోర్టుకు అందించాలి.
4. భూవివాదం ఎక్కడైతే కొనసాగుతుందో (ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా).. అక్కడే మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ జిల్లా పేరును ఇటీవల అయోధ్యగా మార్చారు.
5. మధ్యవర్తిత్వం ప్రక్రియపై రిపోర్టింగ్ చేయకుండా మీడియాను నిషేధించింది సుప్రీంకోర్టు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకుంది.