శబరిమల, రాఫెల్, అయోధ్య..ఒకదాన్ని మించి ఒకటి: నెలరోజుల్లో కీలక తీర్పులు
న్యూఢిల్లీ: మరో నెల రోజులు. సరిగ్గా చెప్పాలంటే అంత కంటే తక్కువే. ఈ వ్యవధిలో మూడు కీలక తీర్పులు వెల్లడి కాబోతున్నాయి. ఈ మూడూ దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్నవే. కోట్లాది మంది హిందువులు, మైనారిటీలకు సంబంధించినవే. అవే- శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో చోటు చేసుకున్నాయని చెబుతోన్న వేల కోట్ల రూపాయల ముడుపుల బాగోతం.. అన్నింటికీ మించి అయోధ్య లో భూవివాదం కేసు. ఈ మూడు కేసులు ఒకదాన్ని మించి ఒకటిగా కనిపిస్తున్నాయి. ఈ మూడింటిపైనా కొన్ని రోజుల వ్యవధిలో వెలువడబోతున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతుండటమే దీనికి కారణం. వచ్చే నెల 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా రాఫెల్, శబరిమల, రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులకు సంబంధించిన తీర్పులను ఆయనే వెల్లడించబోతున్నారు. ఈ మూడింటినీ ఆయనే విచారించడమే దీనికి కారణం. ఆయా కేసుల మీద పూర్తి స్థాయి అవగాహన ఆయనకు ఉంది. తోటి న్యాయమూర్తులతో కలిసి ఈ మూడు కేసులపై సమగ్ర విచారణను చేపట్టారు. అనేక పక్షాల నుంచి దాఖలైన పిటీషన్లపై వారి వాదోపవాదాలను ఆలకించారు.
దీపావళి బొనాంజా: మద్యం ప్రియులకు బంపర్ ఆఫర్.. హస్తినలో ఫారిన్ స్కాచ్పై తగ్గింపు..
ప్రస్తుతం ఈ మూడు కేసులపై తీర్పు రిజర్వ్ లో ఉంది. శబరిమలలో మహిళల ప్రవేశంపై తుది తీర్పు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మహిళల ప్రవేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు భక్తులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు ఇదివరకే ముగిశాయి. అలాగే- రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారం కూడా. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో సుమారు 56 వేల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపైనా విచారణలు పూర్తయ్యాయి.
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసులనూ సుప్రీంకోర్టు విచారణలను ముగించిన విషయం తెలిసిందే. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు విచారణ కొనసాగింది. రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసంన దీనిపై వాదనలను ఆలకించింది. ఈ నెల 16వ తేదీన వాదనల పర్వానికి తెర దించింది ధర్మాసనం. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వచ్చే నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో.. ఈ లోపే తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.