అయోధ్య రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఖాతా నుంచి 6 లక్షలు మాయం!
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో దాతల నుంచి విరాళాలు అందుతున్నాయి. కాగా, మందిర నిర్మాణం కోసం ఏర్పడిన రామ మందిరట్రస్ట్కు చెందిన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో సొమ్ము మాయమైంది.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి లక్నోలోని బ్యాంకు నుంచి ఒకసారి రూ. 2.5లక్షల రూపాయలు, మరో రెండు రోజుల తర్వాత మూడున్నర లక్షలను ట్రస్ట్ చెక్కు పేరుతో దుండగులు విత్ డ్రా చేసుకున్నారు. ఇక మూడోసారి ఏకంగా రూ. 9.86 లక్షల రూపాయలను డ్రా చేసేందుకు ప్రయత్నించారు.
ఇంత పెద్ద మొత్తం డబ్బు కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ట్రస్ట్ నిర్వాహకులకి ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ట్రస్ట్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయోధ్య పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంక్ ఉద్యోగుల పాత్ర కూడా ఏదైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దుండగులు ఉపయోగించిన చెక్కులు ట్రస్ట్ చెక్కులనే పోలి ఉన్నాయని తెలిపారు. విత్ డ్రా చేసుకున్న డబ్బును.. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారని పోలీసులు చెప్పారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని, నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.