అయోధ్య: తవ్వకాల్లో బయటపడిన భారీ శివలింగం, దేవతా మూర్తులు, ఆలయ ఆనవాళ్లు
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామమందిర నిర్మాణం పనులు ప్రారంభమైన విషయం తెలిసింది. కాగా, రామాలయ నిర్మాణం చేపట్టనున్న స్థలానికి దగ్గరలో త్వవ్వకాలు జరుపుతుండగా భారీ శివలింగం, ఇతర దేవతామూర్తులు, శిల్పాలు చెక్కి ఉన్న ధ్వజాలు లాంటి ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి.
Recommended Video
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలు
భారీ శివ లింగంతోపాటు..
ఆలయ నిర్మాణం కోసం వ్యర్థాలను తొలగించి, భూమిని చదును చేస్తుండగా ఈ శిల్పాలు, ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయత్ వెల్లడించారు. బయటపడ్డ వాటిలో ఐదు అడుగుల భారీ శివలింగం, ఏడు నల్ల గీటురాయి స్తంభాలు, ఆరు ఎర్ర రాతి ఇసుక ధ్వజాలు, దేవీదేవతా విగ్రహాలు ఉన్నాయని తెలిపారు.
పురాతన రామాలయానికి చెందినవే..
పది రోజులుగా ఆలయ నిర్మాణ స్థలం వద్ద పనులు జరుగుతుండగా వీటితోపాటు కలశం, రాతి పుష్పాల వంటి అనేక ప్రాచీన వస్తువులు కనిపించాయని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం వెలుగుచూసినవన్నీ అయోధ్యలోని పురాతన రామాలయానికి సంబంధించినవేనని తెలుస్తోంది.
కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు
కాగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు గత నవంబర్ లో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వివాదాస్పద ప్రాంతం హిందువుల(రామ మందిరం)కే చెందుతుందని స్పష్టం చేసింది. ఇక ముస్లిం వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం ఇతర ప్రాంతంలో ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ను కేంద్రం ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్వంలోనే మందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
విరాళాలతోనే ఆలయ నిర్మాణం..
మార్చి నెలలో రాముడి విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలో మానస్ భవన్ కు తరలించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి తీసుకువస్తారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాల ద్వారానే రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పలువురు భక్తులు విరాళాలను ఆలయ నిర్మాణ ట్రస్టుకు అందజేశారు.