మీసాలు లేకుండా అయోధ్యలో రాముడి విగ్రహమా?: హిందూ నేత శంభాజీ
లక్నో: అయోధ్యలో నిర్మించే రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడి విగ్రహానికి మీసం ఉండాలని హిందుత్వ నాయకుడు శంభాజీ భిడే సోమవారం వ్యాఖ్యానించారు. ఆగస్టు 5న అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిర భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్య్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా శంభాజీ బిడే మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరంలో ఏర్పాటు చేసే శ్రీరాముడు, లక్ష్మణుల విగ్రహాలకు మీసాలు ఉండాలని, ఈ మేరు టెంపుల్ ట్రస్టీ గోవింద్ గిరీజీ మహారాజ్కు విన్నవించినట్లు తెలిపారు.
శ్రీరాముడి విగ్రహానికి మీసాలు లేకుండా ఏర్పాటు చేస్తే తన లాంటి భక్తులకు రామ మందిరం కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదని శంభాజీ వ్యాఖ్యానించారు. భూమి పూజకు ముందు ఛత్రపతి శివాజీ మహరాజ్ చిత్రపటానికి పూజలు చేయాలని ఆయన కోరారు. భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలు దీపావళి, దసరా పండగలా వేడుకలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Recommended Video
కొందరు ప్రజలు రాముడి మందిర నిర్మాణం కరోనాను అంతం చేస్తుందని చెప్పుకుంటున్నారంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను శంభాజీ తప్పుబట్టారు. అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం సరికాదన్నారు. భూమి పూజ కార్యక్రమానికి శరద్ పవార్ ఆహ్వానించకపోయినప్పటికీ మహారాష్ట్ర తరపున హాజరుకావాలని ఆయన వ్యాఖ్యానించారు.