Ayodhya verdict :134 ఏళ్ళ వివాదం..అసాధారణ రీతిలో సెలవు రోజు తీర్పు ఇవ్వనున్న ధర్మాసనం
అయోధ్య తీర్పు కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 134ఏళ్ళ సుదీర్ఘ అయోధ్య పంచాయితీకి నేటితో తెరపడనుంది. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సంచలన తీర్పును వెల్లడించనుంది.
అయోధ్య తుది తీర్పు: యూపీలో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ధర్మశాలలు కూడా క్లోజ్
అయోధ్య పంచాయితీలో 2010లో కీలక తీర్పు వెల్లడించిన అలహాబాద్ హైకోర్టు
దశాబ్దాలుగా చాలా సున్నితమైన సమస్య గా, నేటి వరకు పరిష్కారం కాని ఈ కేసులో ఫైనల్ గా తీర్పు వెల్లడించనున్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి పై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక ఈ వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా , రామ్ లల్లాలకు సమానంగా పంచాలని తీర్పునిచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును చాలా మంది ఆశ్రయించారు .
సయోధ్య దిగా సాగిన ప్రయత్నం విఫలం .. మధ్యవర్తుల కమిటీ వేసినా పరిష్కారం శూన్యం
ఇక సుప్రీం లో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అయోధ్య వివాదం పరిష్కారం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎమ్ ఖలీఫుల్ల ,ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇరువురి మధ్య సయోధ్య కుదిరితే సమస్యను పరిష్కరిస్తామని ప్రయత్నించిన వారి ప్రయత్నాలు ఫలించలేదు.
కేశవానంద భారతి కేసు తర్వాత సుదీర్ఘ కాలం సాగిన అయోధ్య కేసు రికార్డ్
ఇక దీంతో సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఈ అయోధ్య వివాదాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది. భారతదేశ చరిత్రలో 68 రోజుల పాటు విచారణ సాగిన అతిపెద్ద కేసుగా కేశవానంద భారతి కేసు నిలిచింది. ఇక ఆ తరువాత స్థానంలో 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ సాగిన అయోధ్య వివాదం రికార్డులకెక్కింది. రాజ్యాంగ సున్నితమైన అంశంపై 40 రోజుల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది.
స్వయంగా రంగంలోకి దిగిన సీజేఐ .. నేడు 10. 30 గంటలకు తీర్పు
ఇక నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అందుకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవ చూపి మరీ ప్రయత్నాలు సాగించారు. భారత దేశ సమగ్రతను కాపాడటం కోసం, మతతత్వ ఘర్షణలకు చోటు లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకున్న తర్వాతనే తీర్పు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్న ధర్మాసనం నేడు 10 గంటల 30 నిమిషాలకు చారిత్రాత్మక తీర్పును వెల్లడించనుంది.
అసాధారణ రీతిలో సెలవు రోజు తీర్పు నిర్ణయం
ఇక అంతే కాదు అయోధ్య కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి యూపీ డీజీపీని,ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రంజన్ గొగోయ్.దశాబ్దాలుగా ఉన్న పంచాయతీకి తెరదించేందుకు అసాధారణ రీతిలో న్యాయస్థానానికి సెలవు రోజైన శనివారం రోజు కూడా తీర్పు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు.