తీర్పును స్వాగతిస్తున్నాం..సంయమనంతో ఉండాలి: రాజ్నాథ్..అందరూ గౌరవించాలి: నితీశ్
అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రులు రాజ్ నాధ్ సింగ్..నితిన్ గడ్కరీ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకంగా రాజ్ నాధ్ సింగ్ అభివర్ణించారు. అదే సమయంలో అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. సుప్రీం తీర్పును అందరూ గౌరవించాలని మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కీలక వ్యాఖ్యలు చేసారు. అయోధ్య వివాదం ఇక ముగిసిందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పిటీషనర్ ఇక్బాల్ అన్సారీ సైతం సుప్రీం తీర్పును గౌరవిస్తామని ప్రకటించారు. తీర్పు తమకు అసంతృప్తి కలిగించినా తాము గౌరవిస్తామని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.
రామజన్మ న్యాస్ కే వివాదాస్పద భూమి: సుప్రీం తీర్పు..ఏకాభిప్రాయం: రాజకీయలు...విశ్వాసాలకు అతీతంగా..!
రామజన్మ న్యాస్ కు వివాదాస్పద భూమిని అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. 134 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి సుప్రీం చారిత్రాత్మక ముగింపు పలికింది. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు లో పూర్తిగా సమతుల్యత పాటించేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో విశ్వాసాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా..న్యాయసూత్రాలకు అనుగుణంగా మాత్రమే తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి రామజన్మ న్యాస్ కు అప్పగించాలని సూచిస్తూనే..అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాలు కేటాయించాలని కేంద్రం లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ధేశించింది. తీర్పు వెల్లడించే సమయంలోనే అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా వ్యవహరించారు.
వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు. మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయించాలని తీర్పును చదువుతూ ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదేని పేర్కొన్నారు. పురావస్తు నివేదికలనూ మదింపు చేసి తీర్పును వెల్లడించామన్నారు.