ayodhya verdict:దేశంలో కొత్తగా మందిర్, మసీద్ నిర్మాణాల అవసరం లేదు: కార్తీ చిదంబరం
అయోధ్య వివాదాస్పద భూమిపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయోధ్య తీర్పును రాజకీయ పక్షాలు, మేధావులు స్వాగతిస్తోన్న వేళ కార్తీ చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశంలో పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు చాలా మందిరాలు ఉన్నాయని కార్తీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కొత్తగా ఆలయాలు, మసీదులు అవసరం లేదని వివరించారు. దేశంలో మందిర్, మసీద్, చర్చి అవసరం లేదని తాను ధృడంగా విశ్వసిస్తానని పేర్కొన్నారు. అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత కార్తీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్తీ తండ్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో కార్తీ కూడా అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చారు.
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ న్యాస్కు చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సున్నీ వక్ఫ్ బోర్డ్కు మరోచోట ఐదెకరాల భూమి కేటాయించాలని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తంమవుతుంది. దేశ చరిత్రలో సుప్రీం కోర్టు తీర్పు సువర్ణాక్షరాలతో లిఖించదగిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ కార్తీ చిదంబరం మాత్రం కొత్త వాదనకు తెరతీశారు.