ayodhya verdict:కరసేవకుల పోరాట ఫలితమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, రాజ్, ఉద్దవ్
అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. దేశ చరిత్రలో నవంబర్ 9వ తేదీ నిలిచిపోతుందని చెప్తున్నాయి. అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్ల నుంచి పీఠముడి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే స్పందించారు.
వెల్ కం
సుప్రీంకోర్టు తీర్పును రాజ్ థాక్రే స్వాగతించారు. అయోధ్యలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు కారణం కరసేవకుల పోరాటమేనని స్పష్టంచేశారు. రామ మందిర నిర్మాణం కోసం వారి పోరాటం ఊరికే పోలేదన్నారు. కరసేవకుల జీవితాల త్యాగానికి ఫలితం దక్కిందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు అయోధ్యలో వీలైనంత త్వరగా రామాలయ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
రామరాజ్యమే..
రామాలయంతోపాటు రామరాజ్యం వస్తోందని రాజ్ థాక్రే చెప్పారు. అదే తన కోరిన అని పేర్కొన్నారు. ఈ సమయంలో శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే ఉంటే బాగుండేదని గుర్తుచేసుకున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై తాము గతంలో చర్చించినట్టు వివరించారు.
సువర్ణాక్షరాలతో..
అయోధ్య తీర్పును శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుతో దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రతీ ఒక్కరు ఆమోదించాలని కోరారు. అంతేకాదు ఈ నెల 24వ తేదీన అయోధ్య వెళతానని తెలిపారు. రామ మందిరం నిర్మించే స్థలాన్ని తమ పార్టీ బృందంతో కలిసి పరిశీలిస్తానని చెప్పారు.
అద్వానీకి అభినందనలు
అంతేకాదు బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీని కూడా కలుసుకొంటానని చెప్పారు. అద్వానీ రథయాత్ర వల్లే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కదలిక వచ్చిందని గుర్తుచేశారు. అద్వానీతో సమావేశమై.. అభినందనలు తెలియజేస్తామని పేర్కొన్నారు. అద్వానీతో సమావేశమైన సందర్భంగా ఆశీర్వాదం తీసుకుంటానని ఉద్దవ్ థాక్రే వెల్లడించారు.