అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్
ఇండోర్: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు జితేంద్ర చౌహాన్. స్థానికంగా ఓ రాజకీయ పార్టీకి సానుభూతిపరుడిగా పేరుందని పోలీసులు తెలిపారు. అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కామెంట్ల ద్వారా ఓ యువకుడు అరెస్టు కావడం ఇదే తొలిసారని అంటున్నారు.
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై నిఘా ఉంచిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి ముందు, ఆ తరువాత కూడా సోషల్ మీడియాపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో- ఇండోర్ కు చెందిన జితేంద్ర చౌహాన్.. సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని వివాదాస్పదమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారీ ఎత్తున అవి షేర్ అయినట్లు, కామెంట్లు చేసినట్లు తెలుసుకున్నారు. గ్రూప్ లల్లో షేర్ అయినట్లు పోలీసుల దృష్టికి వెళ్లింది.
దీనిపై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఇండోర్ శివార్లలో జితేంద్ర చౌహాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవ్వరూ, ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలకు లోబడి తాము జితేంద్ర చౌహన్ ను అరెస్టు చేసినట్లు ఇండోర్ పోలీసులు వెల్లడించారు. అతనిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి, న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.