అయోద్య తీర్పు: సీజే సహా జడ్జీలకు భద్రత పెంపు, వదంతులు నమ్మొద్దన్న యోగి, 12 వేల మంది పోలీసులు
అయోధ్య భూ వివాద తుది తీర్పు వెలువరించే ఐదుగురు సభ్యుల ధర్మాసనం భద్రతను ప్రభుత్వం పెంచింది. వారిపై దాడులు జరగొచ్చేమో అనే సమాచారంతో సెక్యూరిటీ పెంచినట్టు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ భద్రతను జెడ్ క్యాటగిరీకి పెంచారు. సాధారణంగా న్యాయమూర్తులకు నామమాత్రపు భద్రత ఉంటుంది. అయోధ్య భూవివాదం సున్నితమైన అంశమైనందున ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. మిగతా జడ్జీల భద్రతను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది.
మరోవైపు రూమర్లను నమ్మొద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. శాంతి, సామరస్యం కోసం పాటుపడాలని కోరారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో 12 వేల మంది పోలీసు బలగాలను మొహరించారు. వీరికి అదనంగా 16 వేల మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు.
అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చాలా పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యారు. భూ వివాదం పరిష్కారం కోసం కమిటీని కూడా నియమించారు. తర్వాత 40 రోజులపాటు సుప్రీంకోర్టు వాదనలు అలకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 9వ తేదీన శనివారం తీర్పునిస్తామని స్పష్టంచేసింది.