Ayodhya verdict: తీర్పు చెప్పిన సీజే..షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా పిటీషన్లు కొట్టివేత
అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తుంది . దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుపై తమది ఏకాభిప్రాయ తీర్పుగా ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. వివాదాస్పద భూమి తమదేనంటూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేశారు. అలాగే నిర్మోహి అఖాడా పిటీషన్ ను సైతం కొట్టివేశారు . చరిత్ర మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇస్తున్నట్లు వెల్లడించారు రంజన్ గొగోయ్. తీర్పు కాపీ చదివేందుకు అరగంట సమయం పట్టనుంది.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. బాబ్రీ మసీదు పై సున్నీ వక్ఫ్ బోర్డుకు 1946లో ట్రయల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ మసీదును సున్నీ అయిన బాబరు నిర్మించలేదని , ఆయన కమాండర్ నిర్మించారని షియా వక్ఫ్ బోర్డు పిటిషన్ దాఖలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బాబ్రీ మసీదును బాబరు నిర్మించ లేదనేది షియా బోర్డు వాదన. అయితే సుప్రీంకోర్టు షియా బోర్డు పిటిషన్ కొట్టివేసింది. ప్రజల విశ్వాసాలను, నమ్మకాల్ని గౌరవిస్తున్నామని తెలిపింది. మసీదును బాబర్ నిర్మించాడనే దానిని తాము సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
మరోవైపు నిర్మోహి అఖాడా పిటిషన్ను కూడా కొట్టివేసింది ధర్మాసనం. హక్కుల విషయంలో నిర్మోహ అఖాడా వాదన కూడా సరైన వాదన కాదని పేర్కొంది. దీంతో పాటు అక్కడ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారనడానికి పురావస్తు శాఖ ఆధారాల్లేవని న్యాయస్థానం తెలిపింది. బాబ్రీ మసీదును కూడా ఖాళీ స్థలంలో నిర్మించలేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అక్కడ గతంలో ఓ పెద్ద కట్టడం ఉండేదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తెలియజేసిందని కోర్టు పేర్కొంది.
నమ్మకం విశ్వాసాల ఆధారంగా స్థల యజమానిని నిర్ణయించలేమని పేర్కొంది. చట్టబద్దత ఆధారంగానే దాని నిర్ణయం జరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముస్లీంలు బ్రిటీష్ పీరియడ్ వరకు అక్కడ నమాజ్ చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు,పక్షాలు నిరూపించుకోలేకపోయాయని తెలియజేసింది .అయోధ్యకు సంబంధించి నిర్మోహి అఖాడా పిటిషన్ను ఆర్టికల్ 120 ప్రకారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదాస్పద భూమికి సంబంధించి నిర్మోహి అఖాడా యజమాని కాదని స్పష్టం చేసింది.