Ayodhya verdict : సర్వత్రా ఉత్కంఠ..తీర్పు చెప్పే ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇదే !!
అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో దేశం మొత్తం అప్రమత్తమైంది. ఇక దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుగానే అన్ని భద్రతా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం . సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రత పెంచింది. ఎక్కడా మత విద్వేషాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయోధ్య తీర్పు: ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదు, ప్రధాని మోడీ
అయోధ్య కేసులో తీర్పు ఇవ్వనున్న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
అయోధ్య తీర్పు నేడు రానున్న నేపధ్యంలో చాలా ఏళ్ళుగా పరిష్కారం కాకుండా ఉన్న సున్నితమైన అంశంపై సుప్రీం కోర్టులోని ధర్మాసనం వెల్లడించే తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదం కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పబోతోంది. ఈ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు.ఈ నెల 17న ఆయన పదవీ విరమణ చెయ్యనున్న నేపధ్యంలో ఆయన ఈ వివాదానికి సంబంధించిన తీర్పు ఇవ్వనున్నారు.
అక్టోబర్ 16 న తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడికి నిర్ణయం
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లు ఈ కేసుకు సంబంధించిన ధర్మాసనం సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి.ఈ కేసులో ఆగస్టు 6 నుంచి రోజువారీగా కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 40 రోజుల పాటు రోజవారీ విచారణను చేసిన ధర్మాసనం అక్టోబర్ 16 న తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు చెప్పబోతోంది. ఇక ఈ కేసులో తీర్పు చెప్పే ధర్మాసనం సభ్యుల బయో డేటా చూస్తే
జస్టిస్ రంజన్ గొగోయ్... భారత ప్రధాన న్యాయమూర్తి
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ అయోధ్య కేసుకు సంబంధించి ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్నారు.నవంబర్ 18, 1954 న జన్మించిన జస్టిస్ రంజన్ గొగోయ్ 1978 లో బార్ కౌన్సిల్లో చేరారు. గౌహతి హైకోర్టుతో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన 2001 లో గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2010 లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 లో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 , ఏప్రిల్ 23 న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ కేసు తీర్పు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే...
శరద్ అరవింద్ బొబ్డే 24 ఏప్రిల్ 1956 న జన్మించారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా ఉన్నశరద్ అరవింద్ బొబ్డే అయోధ్య కేసు ధర్మాసనంలో రెండో న్యాయవాది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గా పని చేశారు . ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ, నాగ్పూర్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తున్నారు. ఇక 2013 లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఎస్. ఏ. బొబ్డే ఏప్రిల్ 23, 2021 న పదవీ విరమణ చేయనున్నారు. భారత సుప్రీంకోర్టులో ఎనిమిది సంవత్సరాల పదవీకాలంతో, జస్టిస్ రంజన్ గొగోయ్ యొక్క అధికారం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 18, 2019 నుండి అమలులోకి వస్తారని సమాచారం . జస్టిస్ రంజన్ గాగోయ్ తన వారసుడిగా జస్టిస్ బొబ్డేను అధికారికంగా సిఫారసు చేసినట్లు 18 అక్టోబర్ 2019 న మీడియా నివేదించింది.
జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్
డి.వై.చంద్రచుడ్ నవంబర్ 11, 1959 న జన్మించారు. అయోధ్య ధర్మాసనంలో ఆయన మూడో వ్యక్తి .2016, మే 13 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు రాకముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టక ముందు దేశానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా పని చేశారు.అంతే కాకుండా శబరిమల, భీమా కోరెగావ్, స్వలింగసంపర్కం కేసులతో సహా పలు పెద్ద కేసుల్లో ఆయన బెంచ్లో భాగస్వామ్యం తీసుకున్నారు.
జస్టిస్ అశోక్ భూషణ్
ఉత్తరప్రదేశ్కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ అయోధ్య కేసు ధర్మాసనంలో నాలుగో వ్యక్తి . ఆయన జులై 5 , 1956 లో జన్మించారు 1979లో యుపి బార్ కౌన్సిల్లో చేరిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అశోక్ భూషణ్ 2001 లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015 లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016, మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు అశోక్ భూషణ్.
జస్టిస్ అబ్దుల్ నజీర్
అయోధ్య కేసు బెంచ్లో ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒక్కరు మాత్రమే ముస్లిం . ఆయన జనవరి 5 1958లో జన్మించారు. 1983 లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆయన కర్ణాటక హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత అదనపు న్యాయమూర్తి, శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు నజీర్.ఈ కేసులో ధర్మాసనంలో నజీర్ ఐదో వ్యక్తి . నేడు ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో ఈ ధర్మాసనానికి భద్రత పెంపు చేశారు.