శబరిమల రివ్యూపిటిషన్పై అయోధ్య తీర్పు ప్రభావం చూపుతుందా..?
తిరువనంతపురం: అయోధ్య భూవివాదంలో చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది సుప్రీంకోర్టు. తీర్పు సందర్భంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఇక చివరిగా రాముడి ఆలయంకే భూమి చెందుతుందంటూ తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఈ తీర్పు వచ్చేవారం వెలువడనున్న శబరిమలై పై ప్రభావం చుపుతుందా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శుక్రవారం కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
విశ్వాసం నమ్మకాలను విస్మరించలేమన్న సుప్రీంకోర్టు
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంకు అనుమతిస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం వచ్చేవారంలో తీర్పు ఇవ్వనుంది. అయితే అయోధ్య విషయంలో విశ్వాసం నమ్మకాలను కోర్టు విస్మరించలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు దీని ఆధారంగానే శబరిమల తీర్పు ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ ఇటు రాజకీయనేతల్లోను అటు కేసును దగ్గరగా పరిశీలిస్తున్నవారిలోను చర్చకు దారితీస్తోంది.
శబరిమల రివ్యూ పిటిషన్పై తీర్పు ప్రభావం
అయోధ్య తీర్పు సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పలు అంశాలను ప్రస్తావించారు. రామజన్మభూమి లీగల్ పర్సనాలిటీ కాదన్న జస్టిస్ రంజన్ గొగోయ్ విగ్రహం మాత్రం చట్టపరిధిలోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు భక్తుల విశ్వాసం నమ్మకాన్ని కోర్టు విస్మరించడం లేదని చెప్పారు. ఇక శబరిమల అంశం కూడా నమ్మకం విశ్వాసంల మీదే ముడిపడి ఉంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదనేది ఒక నమ్మకం విశ్వాసం ఉంది. శబరిమల అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని భక్తులు విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం ఉండదనేది వాదన. ఈ క్రమంలోనే నమ్మకం విశ్వాసం ఆధారంగా చూసుకుంటే అయోధ్య తీర్పు ప్రభావం శబరిమల రివ్యూ పిటిషన్ తీర్పుపై కనిపిస్తుందని చెబుతున్నారు న్యాయనిపుణులు.
అయోధ్య తీర్పే శబరిమలకు వర్తిస్తుందా..?
ఇదిలా ఉంటే అయోధ్య తీర్పు ప్రభావం దాని పర్యవసనాలు శబరిమల రివ్యూ పిటిషన్పై ఉంటుందని చెప్పారు బీజేపీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్. అయోధ్య తీర్పులో నమ్మకం విశ్వాసం అనే అంశాలనే కోర్టు ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుందని చెప్పారు. అక్కడున్న దేవుడిని జూరిస్డిక్షన్ పర్సనాలిటీ కింద కోర్టు పరిగణించిందని గుర్తుచేశారు. ఇప్పుడు శబరిమలలో కూడా ఇలానే కోర్టు చూసే అవకాశం ఉందని చెప్పారు. విశ్వాసం, నమ్మకంలతో కాకుండా పురుషులను స్త్రీలను సమానత్వంతో చూడాలని ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేశారు. కానీ ఒక వ్యక్తి నమ్మకం, విశ్వాసం మేరకు తన ఇష్ట దైవాన్ని పూజించుకోవచ్చనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు మరోసారి గుర్తుచేసిందని రాజశేఖరన్ చెప్పారు. ఇదే తీర్పు శబరిమలకు కూడా వర్తిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.