మందిరానికి లైన్ క్లియర్: మసీదుకు అయిదెకరాల భూమి: అయోధ్యలోనే మందిర్..మసీదు..!
మందిర్ కు లైన్ క్లియర్..మసీదుకు భూమి ఇవ్వాలని ఆదేశం. రెండు వర్గాలకు వాదనలు..చరిత్ర..విశ్వాసాలను ప్రస్తావించారు. పరిష్కారం కోసం 134 ఏళ్లుగా ఎక్కడైతే సమస్య కొనసాగుతుందో..అక్కడే సమస్యకు పరిష్కారం చూపించారు. వివాదాస్పద భూమిని రామజన్మన్యాస్ కు సుప్రీం కేటాయింది. అదే సమయంలో మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాలు ప్రభుత్వమే కేటాయించాలని ఆదేశించింది.
దీని ద్వారా అయోధ్యలో మొదలైన సమస్య..రెండు వర్గాలకు అయోధ్యలోనే పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ఒక వర్గం కోరుకున్నట్లుగా రామాలయం.. మరో వర్గం విశ్వాసాలను అనుగుణంగా మసీదు రెండు అయోధ్యలోనే ఏర్పాటు చేసే విధంగా.. భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను పెంచేలా అయిదుగురు జడ్జీల ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోనుంది.
2.77 ఎకరాల్లో మసీదు నిర్మాణమేమీ లేదు: సుప్రీంకోర్టు
అయోధ్యలోనే మందిర్..మసీదు..
అయోధ్యలో రామాలయం..మసీదు వ్యవహారం పైన దాదాపు 134 ఏళ్లుగా వివాదం సాగుతోంది. అనేక పరిణామాలకు కేంద్రంగా మారింది. అయోధ్య వివాదం పేరుతో దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ.. న్యాయ పరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. అటువంటి జటిల సమస్య విషయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. తన సారధ్యంలో ఏర్పాటైన బెంచ్ లో ని మిగిలిన నలుగురు న్యాయమూర్తులను సమన్వయం చేసుకున్నారు. తీర్పు సిద్దమైన సమయంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులపైన సమీక్ష చేసి..ఆ విధంగా శ్రద్ద చూపిన తొలి ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులెకెక్కారు. ఇక, తీర్పు వెల్లడి విషయంలోనూ అయిదుగురు జడ్జిలు ఏకాభిప్రాయంతో సంతకాలు చేసారు. ఎక్కడైతే సమస్య అయోధ్యలో మొదలైందో..ఆ అయోధ్యలోనే పరిష్కారం చూపించారు. రెండు వర్గాల వాదనల వెనుక ఉన్నా చారిత్రక వాస్తవాలను గుర్తించారు. కొన్నింటి పైన న్యాయ పరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. చివరకు ..అదే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూనే..అయోధ్యలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వమే అయిదు ఎకరాల భూమి ఇచ్చేలా అదేశించారు.
రెండిటి బాధ్యతలు ప్రభుత్వానికే..
సుప్రీం తీర్పులో కొన్ని మార్గదర్శకాలు స్పష్టం చేసింది. అయోధ్య యాక్ట్ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్ధలాన్ని రామజన్మ న్యాస్కే అప్పగించింది. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను సైతం తోసిపుచ్చింది. నిర్మోహి అఖారాకు వారసత్వ హక్కులు క్లెయిమ్ చేసే హక్కు లేదని తేల్చిచెప్పింది. మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోమని.. న్యాయసూత్రాల ఆధారంగానే భూమి యాజమాన్య హక్కులు నిర్ణయిస్తామంటూ తీర్పులో తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి అయిదు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అది ఎక్కడ కేటాయించాలనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని..కోర్టు తీర్పు పైన తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఆరెస్సెస్ సైతం స్పష్టం చేసింది. దీని ద్వారా ప్రభుత్వం ఇప్పుడు అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ ఏర్పాటు.. అదే విధంగా మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించాల్సి ఉంది. ఇక..ఇప్పుడు ప్రభుత్వానిదే ఈ బాధ్యత.
ముస్లిం లా బోర్డు రివ్యూకు వెళ్తుందా...
అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. అయితే ఇందులో తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. తీర్పును మరోసారి పరిశీలించి తమ సమస్యలపైన దృష్టి సారించాల్సిందిగా సుప్రీంకు విన్నవిస్తామని తెలిపింది. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని, 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే.. 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా.. అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రశ్నించింది. ఇక, ఇప్పుడు తీర్పు కాపీనీ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత స్పందించే అవకాశం ఉంది.