ఆయుష్ వైద్యులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కీలక సూచన... సుప్రీంలో అఫిడవిట్...
కోవిడ్ 19 చికిత్స కోసం ప్రభుత్వం ఆమోదించిన ఔషధాలను కేవలం ఇమ్యూనిటీ బూస్టర్స్(రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రలు)గా మాత్రమే అందించాలని... అంతే తప్ప వ్యాధి నివారణ కోసం కాదని ఆయుష్ డాక్టర్స్,హోమియోపతి వైద్యులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ఆయుష్ వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో ఏ మెడిసిన్ను కోవిడ్ 19 నివారణిగా పేర్కొనవద్దని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ ఏడాది అగస్టు 21న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డా.ఏ.కె.బి సద్భావన మిషన్ ఆఫ్ స్కూల్ హోమియో ఫార్మసీ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీం ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని కోరడంతో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.6 మార్చి, 2020న కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నవి మినహా... ఆయుష్ వైద్యులు కోవిడ్ -19కు నివారణగా ఎటువంటి మెడిసిన్ను ప్రకటించడం గానీ సూచించడం గానీ చేయవద్దని కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video
కేంద్రం తరుపున సుప్రీంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేరళ హైకోర్టు తీర్పును సమర్థించారు. కోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ప్రకారం... ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి,మార్చి నెలల్లో రెండుసార్లు మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం కోవిడ్ 19 తరహా అనారోగ్యానికి హోమియోపతి విధానంలో మూడు దశల్లో నివారణను సూచించారు. సంప్రదాయిక వైద్య విధానం ద్వారా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ నేత్రుత్వంలోని ఆయుష్ రీసెర్చ్&డెవలప్మెంట్ టాస్క్పోర్స్తో సంప్రదింపుల తర్వాత డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ రీసెర్చ్ కౌన్సిల్స్ అండ్ డైరెక్టర్స్ దీన్ని ఈ మార్గదర్శకాలను రూపొందించారు. మొత్తం మీద ఆయుష్ వైద్యులు కోవిడ్ 19 నివారణ పేరుతో ఎటువంటి మెడిసిన్ ఇవ్వొద్దని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.