750 కిలోమీటర్ల మేర జ్యోతులు.. అయ్యప్ప భక్తుల వినూత్న నిరసన
కేరళ : శబరిమల ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హిందువులు తీవ్ర స్వరంతో ఖండిస్తున్నారు. దశాబ్ధాలుగా వస్తున్న ఆచారానికి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు గండికొట్టేలా ఉందని మండిపడుతున్నారు. దీనిపై కేరళ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులోభాగంగా అయ్యప్ప భక్తులు గురువారం కనివినీ ఎరుగని రీతిలో చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. 750 కిలోమీటర్ల మేర రోడ్లపై నిలబడ్డ భక్తులు జ్యోతులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.
శబరిమల ఆలయంలోకి మహిళలు రాకూడదనే నిబంధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదస్పదంగా మారింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తూ సెప్టెంబర్ 28న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. మతాచారాల పేరిట మహిళలపై వివక్ష చూపించడం తగదని.. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది. దీంతో అయ్యప్ప భక్తులతో పాటు హిందు సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అయ్యప్ప భక్తులు భగ్గుమంటున్నారు. 10-50 ఏళ్ల వయసున్న మహిళలు ఆలయంలోకి రాకూడదనే నిబంధనను అతిక్రమించడం సరికాదని వాదిస్తున్నారు. అలా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించినవారికి, అయ్యప్ప భక్తులకు మధ్య వివాదం రాజుకుంటోంది. ఈక్రమంలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి.