18 పడి మెట్లెక్కిన శ్రీలంక మహిళ.. దర్శనంపై ఎన్నో అనుమానాలు..!
కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఉదంతం ఇంకా చల్లారనే లేదు. ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోనికి వెళ్లినందుకు కేరళ రణరంగంలా మారింది. హిందూవాద సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. అంతేకాదు దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు, బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నారు. ఈక్రమంలో మరో మహిళ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం చర్చానీయాంశమైంది.
శ్రీలంకకు చెందిన శశికళ అనే 46 ఏళ్ల మహిళ గురువారం రాత్రి ఆలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భర్త, కుమారుడితో శబరిమలకు చేరుకున్న శశికళ తొలుత పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను మోనోపాజ్ దశకు చేరుకున్నట్లుగా నిర్ధారించే ధృవీకరణ పత్రాలు చూపించడంతో భద్రత నడుమ పోలీసులు ఆలయ దర్శనానికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. 18 పడి మెట్లు ఎక్కి సన్నిధానం వరకు చేరుకున్నాక ఆలయ అర్చకులు గుడిలోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. శశికళ కూడా దీన్ని ధృవీకరించేటట్లు మీడియాతో మాట్లాడారు. తాను మెట్ల వరకు చేరుకున్నా.. అయ్యప్ప దర్శనం కాలేదని తెలిపారు.
మొత్తానికి శ్రీలంక మహిళ శశికళ శబరిమల యాత్రపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులేమో ఆమె దర్శనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆమేరకు సీసీ టీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. కానీ శశికళ మాత్రం దర్శనం కాలేదని చెబుతుండటం గమనార్హం.
18 పడి మెట్లెక్కిన శ్రీలంక మహిళ.. దర్శనంపై ఎన్నో అనుమానాలు..!#SabarimalaTemple #SabarimalaEntry pic.twitter.com/Tx7qBe6T6n
— Oneindia Telugu (@oneindiatelugu) January 4, 2019