ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్
Recommended Video
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. మోడీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
నాడు నిలబెట్టిందే నేడు కూలదోస్తోందా: యూపీ ఫలితాలతోనే మోడీ భవితవ్యం..అంతుచిక్కని అంచనాలు
ప్రధాని పోస్టు ఇవ్వకున్నా పర్లేదు
ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాల్సిన అవసరముందని ఆజాద్ అభిప్రాయపడ్డారు. బీజేపీయేతర పార్టీలన్నీ ముందుగానే పీఎం అభ్యర్థిని నిర్ణయించాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి పంతాలకు పోదని, ఒకవేళ ప్రధాని పదవి తమ పార్టీకి కట్టబెట్టకపోయినా పరవాలేదని ఆజాద్ స్పష్టం చేశారు. గతంలో రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ తాజా ప్రకటనపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
కూటమి ప్రయత్నాల్లో భాగమే
ప్రధాని పదవి ఇవ్వకున్నా పర్లేదన్న కాంగ్రెస్ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రయత్నాల్లో భాగంగానే ఆజాద్ ఈ కామెంట్లు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా ఏకమైన పార్టీలకు చెందిన కొందరు నేతలు ప్రధాని పదవిపై ఆశతో ఉన్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి రేసులో ముందున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్ వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని పదవి అంశాన్ని ఆజాద్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
రాహుల్కు మద్దతిస్తున్న నేతలు
ఇదిలా ఉంటే ప్రధాని పదవిపై తనకు ఏ మాత్రం ఆశలేదని రాహుల్ గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు. అయితే డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధానిగా రాహుల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లనున్నట్లు సమాచారం.
బీజేపీయేతర ప్రభుత్వంపై ధీమా
సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీ, ఎన్డీఏలు మరోసారి అధికారం చేపట్టే ప్రసక్తేలేదని ఆజాద్ తేల్చిచెప్పారు. నరేంద్రమోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టే అవకాశమేలేదని అంటున్నారు. కేంద్రంలో నాన్ ఎన్డీఏ, నాన్ బీజేపీ ప్రభుత్వం లువుదీరుతుందని ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు.