ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న ఆజం ఖాన్.. క్షమించేది లేదన్న రమాదేవి..
ఢిల్లీ : సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఎట్టకేలకూ మెట్టు దిగొచ్చారు. బీజేపీ ఎంపీ రమాదేవిపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులపై తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. తాను మాట్లాడిన మాటలు అభ్యంతరంగా ఉండే అందుకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. సోమవారం లోక్సభ సమావేశం ప్రారంభానికి ముందు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఆజం ఖాన్, స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. అనంతరం లోక్సభలో క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే ఆజం ఖాన్ క్షమాపణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని రమాదేవి స్పష్టంచేశారు. దేశాన్ని, దేశంలోని మహిళలందరినీ ఆజం ఖాన్ వ్యాఖ్యలు గాయపరిచాయని అన్నారు. మహిళల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని, అయినా ఎప్పుడూ మార్పు కనిపించదని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడే ఆజం ఖాన్ తన పద్దతి మార్చుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలకు అదే రోజు క్షమాపణ కోరి ఉండాల్సిందని, అయితే ఆయన సభ నుంచి వాకౌట్ చేయడం పుండుపై కారం చల్లినట్లుగా ఉందని అన్నారు.
గురువారం లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో మాట్లాడిన ఆయనకు స్పీకర్ స్థానంలో ఉన్న ఎంపీ రమాదేవి సభాపతి స్థానాన్ని చూస్తూ మాట్లాడాలని సూచించారు. దీంతో ఆమెను ఉద్దేశించి ఆజం ఖాన్ మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూడాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్లను మహిళా ఎంపీలతో పాటు అన్ని పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాయి. దీంతో మెట్టు దిగొచ్చిన ఆజంఖాన్ సభలో క్షమాపణలు కోరారు.