తాజ్మహల్ను కూల్చండి, పలుగు పార తెస్తా: ఖాన్
న్యూఢిల్లీ: తాజ్మహల్ను కూల్చి ఆ స్థానంలో శివాలయం నిర్మించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్పూర్లోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఆగ్రాలోని తాజ్ మహల్ను కూల్చి శివాలయం కడతామని శివసేన ముందుకు వస్తే, తాను కూడా చేతులు కలిపి పలుగు, పార తెస్తానని అన్నారు. శివసేన కార్యకర్తలు కనుక తాజ్మహల్ని కూల్చివేస్తే, అందుకు మొదటి సుత్తి తనదే అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బాబ్రీ మసీదును కూల్చి 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించిన ఆయన దేశంలో పెద్ద ఎత్తున మతకల్లోలం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ స్థానంలో పదిహేడవ శతాబ్దానికి ముందు శివాలయం ఉండేదని ఆగ్రాకు చెందిన న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శివాలయం ఉన్న స్థలంలో నిర్మించిన తాజ్ మహల్ను హిందూ దేవాలయంగానే పరిగణించాలని, అక్కడ ప్రార్థనలు చేయకుండా ముస్లింలను నిరోధించాలని కూడా ఆగ్రా లాయర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ లోకసభలో వివరణ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని తాజ్ మహల్ వద్ద హిందూ దేవాలయం ఉన్నది అనేందుకు ఆధారాలు లేవని చెప్పారు. హిందూ ఆలయంగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ సమాధానమిచ్చారు. అయితే పురావస్తు శాఖ కూడా అక్కడ శివాలయం ఉందన్న వాదనను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.