‘ఉగ్రవాదులను మీ ప్లేన్లో తీసుకురండి’: మోడీకి అజాం
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చే ఏడాది పాకిస్థాన్ వెళితే.. తిరిగి వచ్చేటప్పుడు విమానంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ కోరారు. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఏవిధంగా ప్రత్యేక విమానంలో దేశం దాటారో.. అదే విధంగా వారందరిని భారత్కు తీసుకు రావాలన్నారు.
ఆదివారం రాత్రి ఝాన్సీలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన అనంతరం అజాంఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది సార్క్ సమావేశాలకు మోడీ పాక్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పాక్లో తలదాచుకుంటున్న భారత మోస్టు వాంటెడ్ ఉగ్రవాదులను తిరిగి భారత్ తీసుకురావాలి' అని అన్నారు.
గత వారం నవాజ్ షరీఫ్ సార్క్ సమావేశాలకు మోడీని ఆహ్వానించగా దానికి ఆయన అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసి విమాన సిబ్బందితో పాటు 155 మందిని అఫ్ఘనిస్థాన్లోని ఖాందహార్ తరలించారు.
అప్పుడు భారత ప్రభుత్వం వారితో చర్చించి.. బందీగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన మౌలానా మసూద్ అజార్తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను విడిచిపెట్టి, ప్రత్యేక విమానంలో దేశం నుంచి పంపించారు.