ముస్లీంలు మాంసం తినొద్దు, దేశవ్యాప్తంగా ఆపేయండి: అజంఖాన్
సమాజ్ వాది పార్టీ నేత, మాజీ మంత్రి అజం ఖాన్ నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
లక్నో: సమాజ్ వాది పార్టీ నేత, మాజీ మంత్రి అజం ఖాన్ నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా అక్రమ కబేళాలను మూయించాడు.
దీనిపై అజం కాన్ స్పందించారు. దేశవ్యాప్తంగా ఆవులు సహా పశువధపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పశువధ కొన్ని చోట్లే ఎందుకు నిషేధిస్తున్నారని, దేశవ్యాప్తంగా నిషేధం విధించి ఎవ్వరూ మాంసం తినొద్దని ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
కొన్ని రాష్ట్రాల్లో పశువధ అమలులో ఉందని, ఇతర రాష్ట్రాలలో ఎందుకు లేదన్నారు. ఇలాంటి అంశాల్లో అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండాలన్నారు. అంతటా పశువధ నిషేధించి మాంసం తినడం మానేయాలన్నారు.
యూపీ ప్రభుత్వం చట్టపరమైన కబేళాలను మూసేయకపోవడంపై ఖాన్ ప్రశ్నించారు. లైసెన్స్ ఉన్న కబేళాల్లో పశువులను వధిస్తే తప్పు లేదని, అక్రమంగా వధిస్తేనే తప్పా అన్నారు. దాని అర్థం అదేనా.. అక్రమమైనవి, అక్రమం కానివి అంతా ఆపేసి అన్ని కబేళాలను మూసేయాలన్నారు. అసలు జంతువులను వధించొద్దన్నారు.
అలాగే జైనులు తదితర మతాలు కోళ్లు, మేకలను చంపడం కూడా చంపొద్దని చెప్తున్నాయన్నారు. ఇక ముస్లింలు కూడా మాంసం తినడం ఆపేయాలని అజం ఖాన్ సలహా ఇచ్చారు. ఇస్లాంలో మాంసం తినాలనే నిబంధనేమీ లేదన్నారు.