ఆజాం ఖాన్ కు శిరచ్చేదన శిక్ష విధించాలి..! మండిపడ్డ బీజేపి నేత..!!
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో బీజేపి, సమాజ్ వాదీ పార్టీల రాజకీయం రసవత్తరంగా సాగుతుంటుంది. ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు పరస్పరం చేసుకునే వ్యక్తిగత విమర్శలు రాజకీయ దుమారాన్ని రేపుతుంటాయి. భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీపై సమాజ్ వాదీ పార్టీ నేత ఆజమ్ఖాన్ అభ్యంతర వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ఆజమ్ఖాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత అఫ్తాబ్ ఆడ్వాణీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఖాన్కు ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలన్నారు.
ఆయన తల నరికేయాలంటూ అఫ్తాబ్ ఓ వీడియోలో మాట్లాడారు. 'ఎంపీ రమాదేవిపై ఆజమ్ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. వాటిని ఖండిస్తున్నామన్నారు.అంతే కాకుండా అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన తల తీసేయాలని ఘాటుగా స్పందించారు. మహిళలను అవమానించడానికే వీరంతా ఉన్నారని, ఇలాంటివి ఇకపై సహించేది లేదన్నారు. ఇంతకు ముందు జయప్రద విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనకు తగిన శిక్ష విధించాల్సిన సమయం ఇది. లేకపోతే ఈ దేశానికే ప్రమాదం. దేశంలో చెడు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఆయన వల్ల మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు ఆయన మాటలు శ్రుతి మించుతున్నాయి' అని వ్యాఖ్యానించారు. లోక్సభ జరుగుతున్న సమయంలో భాజపా ఎంపీ రమాదేవిపై ఆజమ్ఖాన్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని అందరూ డిమాండ్ చేసినా అందుకు ఆయన అంగీకరించలేదు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే అవసరమైతే రాజీనామా చేస్తాను గానీ క్షమాపణలు మాత్రం చెప్పనని తేల్చి చెప్పారు. దీంతో ఈ దుమారం తారా స్థాయిలో చెలరేగింది.