ప్రణబ్ వద్దకు క్యూ, అజహర్ భేటీ: కెసిఆర్, బాబు కూడా
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న ప్రణబ్ ముఖర్జీ వద్దకు రాష్ట్రానికి చెందిన నేతలు క్యూ కడుతున్నారు. ఉదయం నుండి ఆయన బిజీగా ఉన్నారు. ప్రణబ్ను రాత్రి ఎనిమిది గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు 35 మంది నాయకులు కలువనున్నారు. తెలంగాణ ప్రక్రియలో జాప్యం చేయవద్దని వారు ప్రణబ్ను కోరనున్నారు. రాత్రి ఎనిమిది గంటల నలభై అయిదు నిమిషాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాలు చంద్రబాబు నాయుడు కలుస్తారు.
అంతకుముందు ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. సమైక్యాంధ్ర కోసం జగన్, ఆ పార్టీ నాయకులు అఫిడవిట్స్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లులో లోపాలు ఉన్నట్లు చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరారు.
కిరణ్, ప్రణబ్లతో అజహరుద్దీన్ భేటీ
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఎంపి అజహరుద్దీన్ రాష్ట్రపతిని కలుసుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.
కాగా, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి టిడిపి వస్తున్న వ్యతిరేకతను మరల్చేందుకే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, సమన్యాయం అంటున్నారని, సమ న్యాయం అంటే ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా ఆయన చెప్పడం లేదని కడియం అన్నారు. తమకు ఎవరితో పొత్తులు అవసరం లేదని, ప్రజాభీస్టం మేరకే కాంగ్రెస్ పార్టీతో తెరాస పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.