నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !
హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ రావాలని లక్షంగా పెట్టుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
హావేరీలో ప్రధాని నరేంద్ర మోడీ విజయసంకల్ప యాత్ర, బీజేపీ శక్తి కేంద్రం ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కర్ణాటకలో 22 లోక్ సభ నియోజక వర్గాల్లో విజయం సాధించాలని నిర్ణయించామని శపథం చేశారు.
మా కొన్ని తప్పుల కారణంతో కర్ణాటకలో అధికారానికి దూరం అయ్యామని యడ్యూరప్ప గుర్తు చేశారు. అధిక ఎమ్మెల్యేల స్థానాలకు కైవసం చేసుకున్నా తాము ప్రతిపక్షంలో కుర్చున్నామని, తక్కువ ఎమ్మెల్యేల స్థానాలు కైవసం చేసుకున్న జేడీఎస్ పార్టీ నేడు అధికారంలో ఉందని బీఎస్. యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు.
సూర్య చంద్రులు ఉన్నది ఎంత నిజమో నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావడం అంతే నిజం అని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జోస్యం చెప్పారు. కర్ణాటకలో 20కి పైగా లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం ఆదేశాలు చెయ్యడంతో కనీసం 22 స్థానాలలో విజయం సాధించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు తన ఇంటి వైపు కన్నెత్తి చూడనని, ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఇంటికి వెలుతానని బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధాన మంత్రి మోడీకి సరిసాటి అభ్యర్థి ఎవ్వరూ లేరని, ఆయననే మళ్లి ప్రధానిని చెయ్యడానికి ప్రతి ఒక్కరు శ్రమించాలని బీజేపీ కార్యకర్తలకు బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు.