పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!
బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ నాయకులు విడుదల చేశారు. బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో తాను సూచించిన అభ్యర్థి పేరు ప్రకటించాలని పట్టుబట్టిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే చివరికి తన పంతం నెగ్గించుకున్నారు.
లోక్ సభ ఎన్నికలు: నటి సుమలత ఆస్తులు ఎన్ని రూ. కోట్లు అంటే ? పేరు కోసం కాదు: సుమలత!
నా మాటే వేదం
బళ్లారి బీజేపీ టిక్కెట్ ఇస్తే తన సోదరి శాంతాకు ఇవ్వాలని, లేదంటే దేవేంద్రప్పకు ఇవ్వాలని బళ్లారి శ్రీరాములు డిమాండ్ చేశారు. బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ విజయం సాధించాలంటే తాను సూచించిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని, తన మాట వినకుంటే తాను ఏమీ చెయ్యలేనని శ్రీరాములు తేల్చి చెప్పారని తెలిసింది. శ్రీరాములును కాదని బళ్లారిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా లేనిపోని ఇబ్బందులు ఎదురౌతానని భావించిన బీజేపీ నాయకులు చివరికి దేవేంద్రప్పకు టిక్కెట్టు ఖరారు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సోదరుడు !
బళ్లారి గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) బి. నాగేంద్ర సోదరుడు వెంకటేష్ ప్రసాద్ బీజేపీ టిక్కెట్ సంపాదించి ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ప్రయత్నాలు చేశారు. అయితే రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరిన వెంకటేష్ ప్రసాద్ కు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వకూడదని కొందరు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీ సవాల్
2018 నవంబర్ లో బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, బీజేపీ నుంచి శ్రీరాములు సోదరి శాంతా పోటీ చేశారు. అయితే ఊహించని రీతిలో ఉగ్రప్ప చేతిలో శాంతా ఓడిపోవడంతో శ్రీరాములుతో సహ బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. ఇప్పుడు మళ్లీ బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ ఉగ్రప్ప పోటీ చేస్తున్నారు.
శ్రీరాములు వార్నింగ్
బళ్లారి జిల్లాలో శ్రీరాములుకు మంచి పట్టు ఉంది. తన సోదరి శాంతాకు లేదా దేవేంద్రప్పలలో ఎవరికో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని శ్రీరాములు డిమాండ్ చేశారు. బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. నాగేంద్ర సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేష్ ప్రసాద్ కు ఎలాంటి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వకూడదని కర్ణాటక బీజేపీ నాయకుల ముందు శ్రీరాములు ఒత్తిడి చేశారని సమాచారం. శ్రీరాములును కాదని బళ్లారి జిల్లాలో ఎలాంటి పని చెయ్యలేమని బీజేపీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ మంత్రి బంధువు
కాంగ్రెస్ పార్టీ మంత్రి సతీష్ జారకి హోళి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకి హోళికి సమీప బంధువు దేవేంద్రప్ప. కాంగ్రెస్ నాయకుల బంధువుకు బీజేపీ టిక్కెట్ ఇప్పించడంలో బీజేపీ ఎమ్మెల్యేలు శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. దేవేంద్రప్పను తాము గెలిపించుకుంటామని కర్ణాటక బీజేపీ నాయకులకు శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిసింది. బళ్లారి లోక్ సభ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు అంటూ కర్ణాటక మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.