నితీశ్కు బిగ్ షాక్.. రివేంజ్ స్టార్ట్.. భవిష్యత్ కార్యాచరణపై ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన..
జేడీయూ బహిష్కృత నేత,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు షాక్ ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నారు. మరో 8 నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత నాయకత్వాన్ని తుడిచిపెట్టి.. బీహార్లో కొత్త నాయకత్వాన్ని గద్దెనిక్కించడమే లక్ష్యంగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. 'బాత్ కీ బీహార్' పేరుతో సరికొత్త క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపారు.
బాత్ కీ బీహార్ క్యాంపెయిన్..
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 'బాత్ కీ బీహార్(బీహార్ మాట)' క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. రాబోయే 100 రోజుల్లో కోటి మంది యువతను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి కొత్త నాయకత్వం కావాలనుకునే ప్రతీ ఒక్కరికి ఈ క్యాంపెయిన్ను దగ్గరచేస్తామన్నారు. తాను బతికి ఉన్నంతవరకు బీహార్ అభివృద్ది కోసం పనిచేస్తానని చెప్పారు.
గతంలో 'యూత్ కీ పాలిటిక్స్' పేరుతోనూ ప్రశాంత్ కిశోర్ ఓ క్యాంపెయిన్ను మొదలుపెట్టారు. దాదాపు 2,38.054 మంది యువతను అందులో భాగం చేశారు. 18-35 ఏళ్ల వయసువారిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి క్యాంపెయిన్ చేపట్టం దేశంలో ఇదే మొట్టమొదటిసారి అని IPAC వెబ్సైట్లో పేర్కొనడం గమనార్హం.
గాంధీ-గాడ్సే కలయిక సాధ్యపడదు..
తాజా ప్రెస్ మీట్లో ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. పార్టీ సిద్దాంతాల గురించి గతంలో చాలాసార్లు తాను,నితీశ్ చర్చించామని చెప్పారు. తాము గాంధీజీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని నితీశ్ తమతో చాలాసార్లు చెప్పారన్నారు. కానీ ఇప్పుడేమో గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సేపై సానుభూతి కనబరుస్తున్న పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. తన దృష్టిలో గాంధీ,గాడ్సే కలయిక సాధ్యపడదని అన్నారు. కాబట్టి జేడీయూ ఇప్పటికైనా తమ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీహార్లో అభివృద్ది జరగలేదన్న ప్రశాంత్ కిశోర్..
అభివృద్ది విషయంలో బీహార్ అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి పోయిందన్నారు ప్రశాంత్ కిశోర్. బీహార్ ప్రజలకు నాణ్యమైన విద్య అందించడంలో నితీశ్ సర్కార్ విఫలమైందన్నారు. అలాగే ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. బీహార్లో అభివృద్ది జరిగిందని.. అయితే రాష్ట్రా స్వరూపాన్ని మార్చివేసేందుకు కానీ వేగం సరిపోదని అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా దక్కిందా అని ప్రశ్నించారు. పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ హోదా ఇవ్వాలని నితీశ్ కేంద్రాన్ని కోరారని, కానీ అది జరగలేదని అన్నారు. నితీశ్ కుమార్ తనను పార్టీలోకి తీసుకున్నా.. బహిష్కరించినా.. వాటన్నింటిని తాను గౌరవిస్తున్నానని చెప్పారు. ఆయన తననెప్పుడూ ఓ కొడుకులా భావించారని, తాను కూడా ఆయన్ను తండ్రిలా భావించానని చెప్పారు. అయితే తమ మధ్య ఉన్న సంబంధం రాజకీయపరమైందే అని స్పష్టం చేశారు.
Recommended Video
నితీశ్కు చెక్ పెట్టేందుకే..
బీహార్ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్ చేపట్టబోతున్న 'బాత్ కీ బీహార్' ప్రకటన అక్కడి రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉంది. కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికే ఈ క్యాంపెయిన్ అని ప్రశాంత్ కిశోర్ చెప్పడం.. నితీశ్కు చెక్ పెట్టడానికే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీతో జేడీయూ పొత్తుపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రశాంత్ కిశోర్.. సీఏఏ విషయంలో నితీశ్పై ఒత్తిడి పెంచి చివరకు తన పదవినే పోగొట్టుకున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్తో పాటు ప్రధాన కార్యదర్శి పవర్ వర్మలపై పార్టీ వేటు వేసింది. మరోవైపు ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ విజయం సాధించిన తర్వాత.. ప్రశాంత్ కిశోర్ను బీహార్ నుంచి ఆ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రశాంత్ కిశోర్ మొదలుపెట్టనున్న బాత్ కీ బీహార్ క్యాంపెయిన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రశాంత్ కిశోర్ చెబుతున్నట్టు.. కొత్త యువ నాయకత్వాన్ని ఆయన రాష్ట్రానికి అందిస్తారా లేక తన క్యాంపెయిన్ ద్వారా మరేదైనా పార్టీకి మద్దతు తెలుపుతారా
అన్నది వేచి చూడాలి.