బురిడీ బాబా! దెయ్యం వదిలిస్తానంటూ.. ఆడపిల్లలపై ఆకృత్యాలు!
భువనేశ్వర్: దెయ్యాన్ని వదిలిస్తానని అంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో బురిడీ బాబా. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ నకిలీ బాబా పేరు బసంత్ కుమార్ బాగ్. ఒడిశాలోని నౌపడా జిల్లా ఖరియార్లో నివసిస్తున్నాడు. అతను ఓ స్వయం ప్రకటిత బాబా. తనకు మహిమలు ఉన్నాయని చెప్పుకొంటూ బాబాగా చలమాణి అవుతున్నాడు. ఖరియార్, చుట్టు పక్కల గ్రామాల్లో నిరక్షరాస్యులను టార్గెట్గా చేసుకుని వారిని దోచుకోవడం పనిగా పెట్టుకున్నాడు.
ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్చేశారు: కొత్త పేరేమిటంటే..?
ఖరియార్ సమీపంలోని గ్రామానికి చెందిన దంపతులు అనారోగ్యానికి గురైన తమ కుమార్తెను బసంత్కుమార్ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ బాలికకు దెయ్యం పట్టిందని, దాన్ని విడిపిస్తానని నమ్మించాడు. సుమారు అయిదు వేల రూపాయలను వారి నుంచి వసూలు చేశాడు. బాలికను తన ఆశ్రమంలోనే వదిలి వెళ్లాలని సూచించడంతో వారు తమ కుమార్తెను అక్కడే వదిలి పెట్టి,తిరుగుముఖం పట్టారు. అదే అదనుగా బసంత్కుమార్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కొన్ని గంటల తరువాత ఆశ్రమానికి వచ్చిన బాధిత బాలిక తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకున్నారు. దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బసంత్ కుమార్ను అరెస్టు చేశారు. అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం బాలికను నౌపడాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.