మార్కెట్లోకి పతంజలి దుస్తులు: రూ.500కే సంస్కార్ జీన్స్, రూ. 1,100కే రూ.7వేల విలువైన ఉత్పత్తులు
న్యూఢిల్లీ: గతంలోనే ప్రకటించిన విధంగా పతంజలి తన దుస్తుల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో పతంజలి తొలి దుస్తుల స్టోర్ను యోగా గురు బాబా రాందేవ్ సోమవారం ప్రారంభించారు. పతంజలి పరిధాన్ పేరిట దుస్తులను విడుదల చేశారు.
ఆస్థా, సంస్కార్, లైవ్-ఫిట్ అనే బ్రాండ్లలో 3500 వేరియెంట్లలో దుస్తులను తీసుకొచ్చింది. రూ.500కే సంస్కార్ జీన్స్ అందిస్తోంది. అంతేగాక, హోం టెక్స్టైల్, షూలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కూడా సిద్ధంగా ఉంచారు. పతంజలి పరిధాన్ స్టోర్లో పురుషులకు, మహిళలకు, చిన్నారులకు కావాల్సిన అన్ని దుస్తులు లభిస్తాయని పతంజలి పేర్కొంది. దీపావళి సందర్భంగా ఐదురోజులపాటు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది.
Patanjali Paridhan is launching three brands - Aastha, Sanskar & LIVE-FIT today with 3500 variants of Apparal, Home Textile, Shoes & Accessorises. Join live on various TV channels at 12 noon today or join at NSP Pritampura, New Delhi pic.twitter.com/X9p730PAb1
— Swami Ramdev (@yogrishiramdev) November 5, 2018
దేశరాజధాని ఢిల్లీలోని పీతాంపురలోని నేతాజీ సుభాష్ ప్లేస్ వద్ద పతంజలి పరిధాన్ తన తొలి స్టోర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బాబా రాందేవ్ ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. కేవలం రూ. 1,100కే రూ.7వేల విలువైన ఒక జీన్స్, 2టీషర్టులు కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది లోపల 100 స్టోర్లను, 2020 వరకు 500 స్టోర్లను తెరుస్తామని వెల్లడించారు.
విదేశీ బ్రాండ్లకు అలవాటుపడిన మన ప్రజలకు స్వదేశీ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతోనే పతంజలి దుస్తుల రంగంలోకి అడుగుపెట్టిందని బాబా రాందేవ్ తెలిపారు. తమ స్టోర్లో వివిధ రకాలైన ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ ఉత్పత్తులను అందించడం అనేది కొత్త ఉద్యమమని అన్నారు.