గుడ్న్యూస్: కరోనాకు పతంజలి మందు..?, 5 రోజుల్లో ఆధారాలు విడుదల: సీఈవో బాలకృష్ణ
కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోందా..? త్వరగా వస్తోందా..? వ్యాక్సిన్ వల్ల వైరస్ సమూలంగా నిర్మూలించొచ్చా...? ఈ ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తున్నాయి. పరిశోధకులు మాత్రం సెప్టెంవర్ వరకు వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్నారు. మరికొందరు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యోగా గురువు రాందేబ్ బాబా, సంస్థ పతంజలి తెరపైకి వచ్చింది. కరోనా వైరస్కు పతంజలి వ్యాక్సిన్ వస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అవును నిజమే..
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో చనిపోగా.. పాజిటివ్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో బాబా రాందేవ్ సంస్థ పతంజలి కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొందనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిని సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ కూడా ధృవీకరించారు. తాము అభివృద్ది చేసిన ఔషధం 5 నుంచి 14 రోజుల్లో రోగులను వైరస్ నుంచి నయం చేస్తుందని తెలిపారు. తర్వాత పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో ఆయుర్వేదంతో వైరస్ నిర్మూలించొచ్చు అని తెలిపారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని.. మరో 4-5 రోజుల్లో ఆధారాలు, డేటాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
నిమగ్నమైన బృందం
కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఒక బృందాన్ని తాము నియమించామని బాలకృష్ణ తెలిపారు. వైరస్తో పోరాడేందుకు శరీరంలో గల సమ్మేళనాలు గుర్తించారని చెప్పారు. తర్వాత వందలాది మంది నుంచి క్లినికల్ ట్రయల్స్ చేశామని, అప్పుడు తమకు 100 శాతం అనుకూలమైన ఫలితం వచ్చిందన్నారు.
ఇలా చేయండి..
వైరస్ వ్యాపిస్తోన్న క్రమంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై ఫోకస్ చేయాలని బాలకృష్ణ కోరారు. యోగా చేసి, పౌష్టికహారం తీసుకోవాలని సూచించారు. రోగ నిరోధక శక్తి పెంచుకొని ఉంటే.. వైరస్ దరి చేరదని అభిప్రాయపడ్డారు. తమ వ్యాక్సిన్ కూడాత్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.