99శాతం ముస్లింలు హిందు మతం స్వీకరించారు: బాబా రాందేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో 99శాతం మంది ముస్లింలు హిందూ మతం స్వీకరించారనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం-బాబ్రీమసీదు భూవివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుపై సుదీర్ఘంగా మాట్లాడారు బాబా రాందేవ్. వివాదాస్పదంగా మారిన భూమి రామమందిరంకే చెందుతుందని చెబుతూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలో ఐదెకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
శ్రీరామచంద్రుడు ముస్లింలకు కూడా ఆరాధ్య దైవమే
శ్రీరామచంద్రుడికి , హిందువులకు అయోధ్యకు సంబంధంపై మాట్లాడిన బాబా రాందేవ్... శ్రీరామచంద్రుడు ఒక్క హిందువులకే దేవుడు కాదని ముస్లింలకు కూడా ఆరాధ్యుడే అనే కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో నివసిస్తున్న 99శాతం ముస్లింలు హిందూ మతం స్వీకరించారని బాబా రాందేవ్ చెప్పారు. ఇక అయోధ్య తీర్పుపై మాట్లాడిన బాబా రాందేవ్ ఈ తీర్పు దేశసమగ్రతను చాటుతోందని చెప్పారు.
ముస్లింలకు మక్కాలా.. హిందువులకు అయోధ్య
ఇక భవిష్యత్తులో చేపట్టబోయే రామమందిర నిర్మాణం హిందూ సంస్కృతిని చాటేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ఆలయంగా అయోధ్య రామమందిర నిర్మాణం ఉండాలని బాబా రాందేవ్ వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం భారత్లో నివసిస్తున్న ప్రతి హిందువు స్వప్నం అని చెప్పారు బాబా రాందేవ్. అంతేకాదు క్యాథలిక్స్కు వాటికన్ ఎలానో, ముస్లింలకు మక్కా ఎలానో, సిక్కులకు స్వర్ణదేవాలయం ఎలానో హిందువులకు కూడా అయోధ్య అలా తయారు కావాలని చెప్పారు.
మసీదు నిర్మాణంకు హిందువులు, ఆలయం నిర్మాణంకు ముస్లింలు
అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడిన బాబారాందేవ్... రామమందిరం నిర్మాణంకు ముస్లింలు సహకరించాలని అదే సమయంలో మసీదు నిర్మాణంకు హిందువులు సహకరించాలని కోరారు. ఇక అయోధ్య తీర్పు వ్యతిరేకంగా వస్తే గొడవలు అల్లర్లు జరుగుతాయని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారని కానీ తీర్పు తర్వాత పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉందన్నారు. అంతేకాదు శాంత్రి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగలేదని గుర్తు చేసిన బాబా రాందేవ్.. ఒక్క చోట కూడా రాళ్ల దాడి జరగలేదని చెప్పారు. భారత్ అభివృద్ధి బాటలో పయనిస్తోందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు రాందేవ్. ఇక తీర్పు వస్తుందనగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శాంతి భద్రతలను కాపాడటంలో చేసిన కృషిని బాబా రాందేవ్ కొనియాడారు.