ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!
అలీఘడ్ : పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్. జనాభాను అదుపు చేయాలంటే కఠిన నిబంధనలు తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో పతంజలి స్టోర్స్ ప్రారంభించిన బాబా రామ్ దేవ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇద్దరిని మించి పిల్లలు ఉన్నవారు ఎలక్షన్లలో పాల్గొనకుండా నిషేధం విధించాలన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వ ప్రోత్సహకాలు అందకుండా చూడాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం తీసుకోకుండా చేయాలని అన్నారు.
దేశంలో జనాభా శరవేగంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డ ఆయన కొన్ని నిబంధనలు తప్పనిసరి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జనాభా అదుపు చేయడానికి నియమాలు రూపొందించాల్సిన అవసరముందన్నారు. ఓటు హక్కు తొలగించడం, ప్రభుత్వ ప్రోత్సహకాలు అందించకుండా చేయడం చేస్తే జనాభా అదుపులోకి వస్తుందన్నారు. మతాలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే అందరికీ వర్తించేలా నియమనిబంధనలు ఉండాలన్నారు. అలా కఠినతరం చేస్తేనే జనాభా కంట్రోల్ అవుతుందని వ్యాఖ్యానించారు.