నేను బాబాని, వీఐపీ సేవలొద్దు: క్యాబినెట్ హోదా తిరస్కరించిన రాందేవ్ బాబా
హర్యానా ప్రభుత్వం యోగు గురు రాందేవ్ బాబాకి ఇచ్చిన క్యాబినెట్ ర్యాంకును ఆయన మంగళవారం తిరస్కరించారు. యోగా, ఆయుర్వేదాలను ప్రమోట్ చేస్తూ, రాష్ట్ర అంబాసిడర్గా ఉన్న ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పిస్తూ, ఇటీవలే హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో యోగా గురు రాందేవ్ బాబాకు క్యాబినెట్ హోదా నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాందేవ్ బాబా తనకిచ్చిన క్యాబినెట్ హోదాను తిరస్కరిస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు.
రాష్ట్రంలో యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతికి తాను ప్రచారకర్తగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ "నేను బాబాను, బాబాగానే ఉండాలనుకుంటున్నాను.... వీఐపీ సేవలను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం లేదు" అని అన్నారు.
అయితే తన సేవలను గుర్తించినందుకు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇలా ఉంటే హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ హర్యానా ఆయుష్ డిపార్ట్మెంట్కి చెందిన 550 మంది డాక్టర్లు యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగాపీఠంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు.
హర్యానాలో ప్రపంచ స్ధాయి హెర్బల్ ఫారెస్ట్ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గాను ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 25,000 వన మూలికల చెట్లను తెప్పించనున్నామని చెప్పారు. యోగాకు హర్యానాను అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు.
తొలి దశలో భాగంగా హర్యానాలోని 50 గ్రామాల్లో ఈ యోగాను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నామన్నారు. దీనికి రాందేవ్ బాబా తన మద్దతుని ప్రకటించారని, దీనిని విజయవంతం చేసేందుకు గాను పార్ట్ టైం ట్రైనర్లను బాబా పంపించేందుకు అంగీకరించారని అన్నారు.