నేనైతే రూ.35-రూ.45కు ఇస్తా: పెట్రోల్ ధరలపై మోడీకి రాందేవ్ బాబా వార్నింగ్
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల పెరుగుదలపై వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు. విపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. గత యూపీఏ హయాంలో చేసిన బాకీలు తీర్చడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలు పెట్రో ధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. అయినప్పటికీ విమర్శలు ఆగడం లేదు. తాజాగా బాబా రాందేవ్ ఈ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేను కేంద్రమంత్రిని, పెట్రోల్ ధరలు పెరిగితే నాకు ఇబ్బంది లేదు: వివాదాస్పద వ్యాఖ్యలు
ఆయన ఓ ఇంగ్లీష్ చానల్తో మాట్లాడుతూ.. ఈ అంశంపై స్పందించారు. ఈ ధరల పెరుగుదల కారణంగా వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. తాను గనుక ప్రభుత్వంలో ఉండి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలపై వినియోగదారులకు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చేవాడినని, పెట్రోల్, డీజిల్లను రూ.35 నుంచి రూ.45 మధ్య ఇచ్చేవాడినని చెప్పారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలామంది ప్రజలు మోడీని విమర్శిస్తున్నారని, కానీ స్వచ్ఛ భారత్ వంటి మంచి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు. వాక్స్వాతంత్య్రం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అని అడిగితే, తాను ఎందుకు ప్రచారం చేయాలని ఎదురు ప్రశ్నించారు. తనంతట తానే రాజకీయాలకు దూరంగా వచ్చానని చెప్పారు. తాను ఏపార్టీతోనూ లేనని, అన్ని పార్టీలతోనూ ఉంటానని తెలిపారు.