బీఆర్ అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండుగులు: సంఘ్ పరివార్గా: కఠిన శిక్షకు సీఎం హామీ
ముంబై: ముంబైలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాసం రాజ్గృహ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పూలకుండీలను చిందరవందరగా విసిరేశారు. సంఘ్ పరివార్ ప్రతినిధులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది కాస్తా రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి. నిందితులపై కఠిన చర్యలను తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హామీ ఇచ్చారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యం: రేట్ ఫిక్స్
బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన భవనం సెంట్రల్ ముంబయిలోని హిందూ కాలనీలో ఉంది. దీన్ని అంబేద్కర్ స్మారక మ్యూజియంగా మార్చారు. ఈ రెండు అంతస్థుల భవనంలో అంబేద్కర్ రచించిన పుస్తకాలు, చితాభస్మం ఉన్నాయి. పలు స్మారక వస్తువులను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఈ భవనంలోని ఓ గదిని లైబ్రరీగా మార్చారు. అందులో 50 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అంబేద్కర్ సమాధి చైతన్యభూమి తరహాలోనే ఈ భవనాన్ని పలువురు సందర్శిస్తుంటారు.
ప్రస్తుతం అంబేద్కర్ కోడలు, ఆయన మనవళ్లు, వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) నాయకుడు ప్రకాష్ అంబేద్కర్, ఆనంద్రావ్, భీమ్రావ్ అక్కడే ఉంటున్నారు. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో ప్రకాష్ అంబేద్కర్ ఇంట్లో లేరు. రాత్రివేళ కొందరు దుండగులు ఈ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భవనం ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇద్దరు దుండగులు రాళ్లు విసురుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు వెల్లడించారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉందనే అనుమానంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు.
Recommended Video
ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సంఘ్ పరివార్ ప్రతినిధులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారంటూ బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నాయి. సంఘ్ పరివార్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ డిమాండ్ చేస్తున్నారు. దళిత బాంధవుడిగా, దళితులు దేవుడిగా భావిస్తోన్న అంబేద్కర్ నివాసంపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందంటూ మండిపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినదిస్తున్నారు.