ఆ హిందూ దేవాలయంలోకి 'వెజిటేరియన్ క్రొకడైల్'.. ఆశ్చర్యపోయిన పూజారులు...
కేరళలోని కసర్గఢ్ జిల్లాలో ఉన్న అనంతపుర అనే గ్రామంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఒక సరస్సు మధ్యలో ఉన్న ఈ ప్రాచీన హిందూ దేవాలయానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. తిరువనంతపురంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి దీన్నే మూలస్థానంగా చెబుతారు. అన్నింటికీ మించి ఈ ఆలయానికి 'బబియా' అనే మొసలి ప్రత్యేక ఆకర్షణ. పైగా ఈ మొసలి శాఖాహారి కావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం.
ఆలయాన్ని ఆనుకుని ఉన్న సరస్సులో ఉండే ఈ మొసలి మంగళవారం(అక్టోబర్ 21) గుడిలోకి వచ్చింది. దీంతో ఆలయ పూజారులు ఆశ్చర్యపోయారు. బబియా ఇలా ఆలయంలోకి రావడం ఇదే మొదటిసారి అని వారు చెప్తున్నారు. అయితే అది ఆలయ గర్భ గుడిలోకి రాలేదని.. కేవలం ఆలయ ప్రాంగణంలోకి మాత్రమే వచ్చిందని ఆలయ అధికారి చంద్రశేఖరన్ తెలిపారు. కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో గడిపాక... తిరిగి సరస్సులోకి వెళ్లిపోయిందన్నారు.
నిజానికి ఈ మొసలి ఈ సరస్సులోకి ఎలా వచ్చింది... దానికి బబియా అని ఎవరు పేరు పెట్టారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ అక్కడి పూర్వీకులు చెప్పేదాని ప్రకారం... దాదాపు 70 ఏళ్లకు పైబడి బబియా ఆ సరస్సులోనే ఉంటోంది. ఇన్నేళ్ల చరిత్రలో అది ఎప్పుడూ ఎవరిపై దాడి చేయలేదు. ఆలయ పూజారులు పెట్టే శాఖాహారాన్ని మాత్రమే అది తీసుకుంటుంది. పూజారులు దాన్ని పిలవగానే సరస్సు నుంచి బయటకొచ్చి... వారు పెట్టే ఆహారాన్ని తింటుంది.
'ఆలయ పూజారి బబియాకు రోజుకు రెండుసార్లు ఆహారం అందిస్తారు. రైస్ బాల్స్ను దాని నోటి వద్ద పెడితే అదే తింటుంది. పూజారికి,దానికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆలయ సరస్సులో చాలా చేపలున్నాయి. కానీ అది వాటిని ఆహారంగా తీసుకోదు. బబియా పూర్తిగా శాఖాహారి. ఆలయ ప్రాచీన సాంప్రదాయాన్ని పాటిస్తూ అది శాఖాహారం మాత్రమే తీసుకుంటుంది.' అని మరో ఆలయ ఉద్యోగి వెల్లడించారు. అయితే వన్యప్రాణి నిపుణులు మాత్రం బబియా మగ్గర్ క్రొకడైల్ అని.. ఆ జాతికి చెందిన మొసళ్లు చేపలు,ఎలుకలు,సరీసృపాలు ఇతరత్రా జంతు జీవాలను ఆహారంగా తీసుకుంటాయని చెబుతుండటం గమనార్హం.