బాబ్రీ కూల్చివేత కేసు: అద్వానీ సహా 12 మందికి బెయిల్ మంజూరు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి మమతా బెనర్జీలు మంగళవారం కోర్టుకు హాజరు కానున్నారు.
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి మమతా బెనర్జీలు మంగళవారం కోర్టుకు హాజరు కానున్నారు. వారు లక్నోకు చేరుకున్నారు. వారిని యూపీ సీఎం ఆదిత్యనాథ్ కలుసుకున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీరు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఎదుట హాజరవుతారు. ఈ మేరకు వీరిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేయనున్నారు.
సుప్రీం షాక్: బాబ్రీ కుట్ర కేసులో అద్వానీకి ఎదురు దెబ్బ, కళ్యాణ్ సింగ్కు మినహాయింపు
వీరితో పాటు బిజెపి నేత వినయ్ కటియార్, వీహెచ్పీకి చెందిన విష్ణుహరి దాల్మియా, హిందుత్వ ప్రచారకర్త సాధ్వి రితంబరలు కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ప్రత్యేక సీబీఐ జడ్జి ఎస్కె యాదవ్ ఇప్పటికే ఆదేశించారు.
వీరందరికీ ఆదేశాలిచ్చే సమయంలోనే వ్యక్తిగత హాజరు నుంచి ఎవరూ మినహాయింపులు, వాయిదాలు కోరరాదని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై రెండు వేర్వేరు కేసులను విచారిస్తున్న న్యాయస్థానం - మహంత్ నృత్యగోపాల్ దాస్, మహంత్ రామ్విలాస్ వేదాంతి, వైకుంఠ్లాల్ శర్మ అలియాస్ ప్రేమ్జీ, చంపత్రాయ్ బన్సాల్, మహంత్ ధర్మదాస్, సతీష్ ప్రదాన్లపై రెండో కేసులో అభియోగాలు నమోదు చేయనుంది.
నేరపూరిత కుట్ర కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిలతో పాటు ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్కు ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాబ్రీ మసీదు కూల్చివేతను నేరంగా పేర్కొన్న సుప్రీం కోర్టు.. ఈ వ్యవహారంలో కటియార్ సహా నలుగురు బిజెపి సీనియర్ నేతలు, ఇతరులపై నేరపూరిత కుట్ర అభియోగం పునరుద్ధరణకు అనుమతిచ్చింది. అనంతరం అద్వానీ, జోషి, ఉమా భారతిలపై కేసును రాయ్బరేలీ కోర్టు నుంచి లక్నోకు సంయుక్త విచారణకు గాను బదిలీ చేసింది.
బెయిల్ మంజూరు
బాబ్రీ మసీదు కేసులో అద్వానీ సహా 12 మందికి బెయిల్ మంజూరు అయింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా పలువురికి బెయిల్ మంజూరయింది. వారు అంతకుముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.