బాబ్రీ కేసు: 2వారాలు వాయిదా, అద్వానీ విచారణ ఎదుర్కొంటారా?
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వక నివేదికలు అ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వక నివేదికలు అందించాలని కోర్టు ఆదేశించింది. రెండు వారాల తర్వాత(ఏప్రిల్ 6న) కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత నేత ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి సహా సీనియర్ నేతలపై కుట్ర ఆరోపణలు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా లేదా అనే సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే.
కేవలం సాంకేతిక కారణాలతో 13 మంది బీజేపీ నేతలపై ఉన్న కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
అదనపు ఛార్జిషీటు సమర్పించేందుకు కూడా కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అద్వానీ సహా 13 మంది బీజేపీ నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా, కేసును 2 వారాల తర్వాత విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.