అయోధ్య వివాదం: సున్ని వక్ఫ్ బోర్డుపై ప్రధాని మోడీ ప్రశంసలు, ఎందుకంటే?
\న్యూఢిల్లీ: అయోధ్య వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ సందర్భంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అభినందనలు తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించారు.
2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ కేసు విచారణను వాయిదా వేయాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదన వినిపించడంపై సున్నీ వక్ఫ్ బోర్డు బుధవారంనాడు స్పందించింది. ఆయన వాదన సరైంది కాదని పేర్కొంది.
'కపిల్ సిబాల్ మా న్యాయవాదే. అయితే ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. కేసు విచారణను ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ వాయిదా వేయాలన్న ఆయన వాదనతో మేము ఏకీభవించడం లేదు. సాధ్యమైనంత త్వరలో ఓ పరిష్కారం కావాలనే మేము కోరుకుంటున్నాం' అని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి హాజీ మెహ్బూబ్ బుధవారం స్పష్టం చేశారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే మోడీ స్పందిస్తూ.. సున్నీ వక్ఫ్ బోర్డు వైఖరిని అభినందించారు. ఇప్పటికే కపిల్ సిబాల్ కాంగ్రెస్ ఏజెంట్ అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.