బాబ్రీ కూల్చివేతకు 22 ఏళ్లు, ఐబీ హెచ్చరిక: పాతబస్తీలో భద్రత, ర్యాలీలకు నో, మెసేజ్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: రేపటికి (డిసెంబర్ 6) బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 22 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు. హైదరాబాదులోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బేగంబజారులో పోలీసులు తనిఖీ చేశారు. ఇక్కడ నిరసనకారులు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. పలు సంస్థలు రేపు బ్లాక్ డే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతించడం లేదు.
తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర అన్ని రాష్ట్రాలలోను సున్నిత ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులో దాదాపు అరవై వేల మంది పోలీసులను మోహరించనున్నారు. ఒక్క చెన్నైలోనే 18,000 మంది పోలీసులను దించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాదు నగర పౌరులకు పోలీసులు ఎస్సెమ్మెస్ సందేశాలు పంపించినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 6న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.
ఐబీ హెచ్చరిక
డిసెంబర్ 6 నేపథ్యంలో ఐబీ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైదరాబాదులో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. లాడ్జీలు, హోటల్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్ననారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.