బాబ్రీ కేసు: బీజేపీ నేతలకు పెద్ద ఊరట, వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతిలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు పలువురికి సీబీఐ కోర్టులో పెద్ద ఊరట లభించింది. కురువృద్ధ నేతలు ఎల్ కే అద్వానీ(89), మురళీ మనోహర్ జోషి(83) లతోపాటు కేంద్ర మంత్రి ఉమాభారతి(58)కి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ కేసులో అభియోగాలు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసి, మరోవైపు వెంటనే బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు తాజాగా ఇకనుంచి వ్యక్తిగతంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో బీజేపీ నేతలకు పెద్ద ఊరటే లభించినట్లయింది. ఇక మీదట ప్రతిసారీ కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు ఈ సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం ఉండదు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాల నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఈ కేసులో నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి.
వీటికి అదనంగా సీబీఐ ప్రత్యేక కోర్టు.. నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది తెలిపారు.