బాబ్రీ మసీదు కూల్చివేత..కేసు కొట్టివేత: ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు? హిందుత్వ జాగృతం
అమరావతి: రెండున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరారోపణలను ఎదుర్కొంటోన్న వారందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా గుర్తించడం పట్ల దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఇన్నేళ్ల తరువాతైనా కేసును కొట్టివేయడం శుభపరిణామమని అంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును కొట్టివేస్తూ లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువడించిన తీర్పును స్వాగతిస్తున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక కాదని పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, లోక్సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతిలపై నమోదైన కేసులను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో నేరారోపణలను ఎదుర్కొంటోన్న మొత్తం 32 మందినీ నిర్దోషులుగా గుర్తించింది.
దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీకి చెందిన వై సత్యకుమార్, బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ తీర్పుతో దేశంలో హిందుత్వం మరింత జాగృతమైందని అన్నారు. నిజం అనేది కొన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురి అవుతుందే తప్ప శాశ్వతంగా ఓడిపోదని అన్నారు. కూల్చివేత సంఘటన ప్రీ ప్లాన్డ్ కాదని న్యాయస్థానం గుర్తించడం గొప్ప విషయమని అన్నారు. భావోద్వేగాలకు లోనైన కరసేవకులు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా సత్యకుమార్ అభివర్ణించారు.
Recommended Video
న్యాయం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. న్యాయం గెలిచిందని, ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందనే విషయాన్ని లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరోసారి రుజువు చేసిందని చెప్పారు. జై శ్రీరాం అంటూ ఆయన నినదించారు. దశాబ్దాల కాలం పాటు న్యాయపోరాటం చేసిన బీజేపీ కురువృద్ధులకు ఈ తీర్పు ఊరట కల్పించినట్టయిందని అన్నారు. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.