ఎల్కే అద్వానీ, ఉమాభారతి సహా: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు: హైఅలర్ట్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 28 సంవత్సరాల తరువాత ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక (ప్రీ-ప్లాన్ట్) కాదని సీబీఐ న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారతీయ జనతా పార్టీ కురువృద్ధులు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, లోక్సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మాజీమంత్రి ఉమాభారతిలపై నమోదైన కేసులను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ కొద్దిసేపటి కిందటే తన తుది తీర్పును వెలవడించారు.
Recommended Video
కేసు కొట్టివేతతో వారికి ఊరట..
ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కతియార్, కల్యాణ్ సింగ్, సతీష్ ప్రధాన్, మహంత్ నృత్య గోపాల్ దాస్ న్యాయస్థానానికి హాజరు కాలేదు. వృద్ధ్యాప్యం వల్ల అద్వానీ, మురళీ మనోహర్ జోషీకి మినహాయింపు ఇచ్చారు. ఉమా భారతి కరోనా వైరస్ పాజిటివ్ కావడం వల్ల ఆమె గైర్హాజర్ అయ్యారు. ఉమా భారతి మినహా మిగిలిన నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు అయ్యారు. మొత్తం 32 మందిలో 26 మంది న్యాయస్థానం ముందు హాజరు అయ్యారు.
బాబ్రీ కూల్చివేతపై రెండు కేసులు..
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. రెండింటినీ జోడించి సీబీఐ న్యాయస్థానం విచారణ కొనసాగించింది. తాజాగా వాటిపై తీర్పు వెలువడించింది. ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్లో ఈ రెండు కేసులు నమోదు అయ్యాయి. ప్రియంవద నాథ్ శుక్లా తొలి కేసును నమోదు చేశారు. గుర్తు తెలియని కరసేవకులపై ఈ కేసు నమోదైంది. భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఈ రెండో కేసు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ గంగా ప్రసాద్ తివారీ ఈ కేసును నమోదు చేశారు.
ఆరుమంది గైర్హాజర్..
వృద్ధాప్యం వల్ల ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోెషి న్యాయస్థానానికి హాజరు కాలేదు. కరోనా పాజిటివ్ వల్ల ఉమా భారతి గైర్హాజర్ అయ్యారు. వేర్వేరు కారణాల వల్ల మహంత్ నృత్య గోపాల్ దాస్, కల్యాణ్ సింగ్, సతీష్ ప్రధాన్ కూడా హాజరు కాలేకపోయారు. 2,000 పేజీల కూడిన తీర్పును న్యాయస్థానం వినిపించింది. 1992 డిసెంబర్ 6వ తేదీ నాటి ఘటనపై తాజాగా తీర్పు వెలువడింది. విచారణ సందర్భంగా సీబీఐ న్యాయస్థానం మొత్తం 351 మంది సాక్ష్యలను ప్రశ్నించింది. 600 డాక్యుమెంట్లను పరిశీలించింది. ప్రాథమికంగా 49 మందిని విచారణ పరిధిలోకి తీసుకుని రాగా.. వారిలో 17 మంది మరణించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలు వీరే..
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత చోటు చేసుకుంది. వేలాదిమంది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ కేసులో మొదటి పేరు ఎల్కే అద్వానీదే. బాబ్రీ మసీదును కూల్చివేసేలా కరసేవకులను ప్రేరేపించారని ఆయనపై కేసు పెట్టారు. అనంతరం వరుసగా మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, వినయ్ కతియార్, కల్యాణ్ సింగ్, సాధ్వి రిథంబర, సతీష్ ప్రధాన్, రామ్ విలాస్ వేదాంతి, చంపట్ రాజ్, మహంత్ నృత్య గోపాల్ దాస్, ధరమ్ దాస్, సాక్షి మహరాజ్, ప్రకాశ్ శర్మ, రామచంద్ర ఖత్రి, అమర్నాథ్ గోయెల్, ధర్మేంద్ర సింగ్ గుజ్జర్, సంతోష్ దుబే, లల్లూ సింగ్, రామ్జీ గుప్తా, కమలేష్ త్రిపాఠి, ఓం ప్రకాశ్ పాండే, బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్, రవీంద్రనాథ్ శ్రీవాస్తవ, నవీన్ శుక్లా, విజయ్ బహదూర్ సింగ్, గాంధీ యాదవ్, ఆచార్య ధర్మేంద్ర యాదవ్, జైభగవాన్ గోయల్ ఉన్నారు.
కేసు సున్నితత్వం వల్ల
ఈ కేసు సున్నితత్వం, అత్యంత సమస్యాత్మకమైనది కావడం వల్ల లక్నో, అయోధ్య, వారణాశి సహా ఉత్తర ప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకున్నారు. న్యూఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, వడోదరా, ముంబై వంటి ప్రాంతాల్లో పోలీసులను మోహరింపజేశారు. తీర్పు అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేలా ఆయా రాష్ట్రాల పోలీసులు ముందుజాగ్రత్త చర్యలను చేపట్టారు.