బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు: కుట్రదారులు దేశానికి క్షమాపణ చెప్పాలన్న యూపీ సీఎం యోగీ
న్యూఢిల్లీ: 28 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది సీబీఐ కోర్టు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరగలేదని పేర్కొన్న కోర్టు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఎవరూ కావాలనే ఈ పని చేయలేదని కోర్టు వెల్లడించింది. అద్వానీ, మురళీమనోహర్ జోషిలు ఆందోళనకారులను అడ్డుకున్నారని కోర్టు పేర్కొంది. సంఘవిద్రోహ శక్తులే బాబ్రీ మసీదును కూల్చివేశాయని కోర్టు అభిప్రాయపడింది.
సత్యమేవ జయతే.
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై తీర్పు వెలువడగానే తీర్పును చాలామంది ప్రముఖులు స్వాగతించారు. 28 ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగిన కేసులో సత్యమే గెలిచిందని మురళీ మనోహర్ జోషి అన్నారు. ఈ ఘటన ఆవేశంలో జరిగిందనేది స్పష్టమవుతోందన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర దాగిలేదని రుజువైందని మురళీ మనోహర్ జోషి చెప్పారు. తమ పోరాటమంతా అయోధ్య మందిరం కోసమే జరిగిందని చెప్పిన మురళీ మనోహర్ జోషి... ఇప్పుడు ఈ తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు. అయోధ్యలో అతి పెద్ద రామమందిరం నిర్మాణం చేపట్టడంపైనే దృష్టి సారించాలని చెప్పారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ అన్నారు. జైశ్రీరాం నినాదాలు చేసి తీర్పును స్వాగతించారు ఎల్కే అద్వానీ. రామజన్మభూమి పట్ల వ్యక్తిగతంగా తనకు, బీజేపీకి ఉన్న అంకితభావం ఏమిటో ఈ తీర్పు అద్దం పడుతోందని అద్వానీ అన్నారు.
బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేశారని.. ఎవరి ఆటలు సాగలేదని ఆయన అన్నారు. వారి ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కుట్రపూరితంగానే సన్యాసులను, బీజేపీ నేతలను, వీహెచ్పీ నేతలను ఇరికించారని మండిపడ్డారు.ఈ కుట్రకు కారణమైనవారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తీర్పుపై స్పందించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ఉమా భారతిలతో సహా మరో 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తీర్పు చెప్పడంలో ఆలస్యమైనప్పటికీ అందరికీ న్యాయం జరిగిందని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
Recommended Video
కుట్రపూరితమైన కేసులు
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సీబీఐ ఇచ్చిన తీర్పును స్వాగతించారు బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్. సత్యమేవ జయతే. సత్యమే గెలిచిందని రాంమాధవ్ అన్నారు. వాస్తవానికి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని నిర్దోషులుగా ఎప్పుడో ప్రకటించాల్సి ఉన్నిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంతగా గౌరవించే వారిపై ఇలా కుట్ర కేసులు పెట్టడం సరికాదన్నారు. దాదాపు 3దశాబ్దాల తర్వాత న్యాయం గెలిచిందని చెప్పారు రాం మాధవ్. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని చెప్పారు.